న్యూఢిల్లీ: లోక్సభ జీరో అవర్లో ఇవాళ సోనియా గాంధీ మాట్లాడారు. ఫేస్బుక్తో పాటు ఇతర సోషల్ మీడియా వ్యవస్థలు చేస్తున్న రాజకీయాలపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఫేస్బుక్ విద్వేషాన్ని పెంచుతున్నట్లు ఆమె ఆరోపించారు. అన్ని రాజకీయ పార్టీలకు సమానమైన అవకాశం ఇవ్వడం లేదని ఫేస్బుక్ను ఆమె నిందించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్లతో టార్గెట్ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. గ్లోబల్ సోషల్ మీడియా కంపెనీలు అన్ని రాజకీయ పార్టీలకు సమ న్యాయం కల్పించడంలేదని సోనియా విమర్శించారు. రూల్స్ను బ్రేక్ చేసి మరీ మత విద్వేషాలను ఫేస్బుక్ రెచ్చగొడుతున్నట్లు సోనియా ఆరోపించారు. ఫేస్బుక్ చేపడుతున్న అరాచక రాజకీయాలకు చరమ గీతం పాడాలని ఆమె డిమాండ్ చేశారు.
సోషల్ మీడియా సంస్థలు ప్రజాస్వామ్యాన్ని హ్యాక్ చేస్తున్నాయన్నారు. రాజకీయా ప్రయోజనాల కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పనిచేస్తున్నాయన్నారు. వాల్స్ట్రీట్ జర్నల్ కథనం గురించి సోనియా ప్రస్తావించారు. ఫేస్బుక్ స్టోరీలు ఎలా రూలింగ్ పార్టీకి ఉపయోగపడుతున్నాయో ఆ కథనంలో చెప్పారన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారి స్వరాన్ని నొక్కేస్తున్నాయన్నారు. అధికార పార్టీతో ఫేస్బుక్ కుదుర్చుకున్న ఒప్పందం సరికాదన్నారు. కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వం మధ్య డీల్ జరిగినట్లు సోనియా ఆరోపించారు. వ్యవస్థీకృతంగా జరుగుతున్న ఫేస్బుక్ జోక్యాన్ని అడ్డుకోవాలని ఆమె అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, సామాజిక సమానత్వాన్ని కాపాడుకోవాలన్నారు.