న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ నోయిడాలోని 40 అంతస్తుల ట్విన్ టవర్స్ను ఈ నెల 28న కూల్చివేయనున్నారు. ఈ మేరకు కూల్చివేతకు అవసరమైన 325 కిలోల పేలుడు పదార్థాలను శనివారం నోయిడాకు తరలించారు. నోయిడా అథారిటీ పర్యవేక్షణలో కూల్చివేత జరుగనున్నట్లు తెలుస్తున్నది. రెండు టవర్లను కూల్చివేసేందుకు 3700 కిలోల పేలుడు పదార్థాలు అవసరం కాగా.. ప్రతి రోజూ 325 కిలోల పేలుడు పదార్థాలను అందుబాటులో ఉంచనున్నారు.
ఇందులో భాగంగా ఇవాళ 325 కిలోల పేలుడు పదార్థాలను వ్యాన్లలో భవనం వద్దకు తీసుకువచ్చారు. పేలుడు పదార్థాలతో టవర్లను కూల్చివేసేందుకు నోయిడా అథారిటీకి సుప్రీం కోర్టు ఇటీవల అనుమతి ఇచ్చింది. ‘కట్టుదిట్టబమైన భద్రత మధ్య నోయిడాలోని సూపర్ టెక్ ట్విన్ టవర్స్కు పాల్వాల్నుంచి పేలుడు పదార్థాలను తీసుకువచ్చారు. ఈ నెల 28న భవనాన్ని కూల్చివేయనున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశించింది.
నోయిడా అథారిటీ నేతృత్వంలో పూర్తి కూల్చివేత పనులు జరుగుతున్నాయి’ అని ఓ పోలీస్ అధికారి పేర్కొన్నారు. కూల్చివేసేందుకు భవనంలో 9,400 రంధ్రాలను వేయగా.. వీటిని పేలుడు పదార్థాలతో నింపనున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక 28న రెండు టవర్లను కూల్చివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ పరిధిలోని నోయిడా సెక్టార్ 93 ప్రాంతంలో సూపర్ టెక్ లిమిలెడ్కంపెనీ 2009లో భారీ ప్రాజెక్టు చేపట్టింది.
ఈ భవనాల విషయంలో రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రణాళికను చూపాలన్న నిబంధనను బిల్డర్ పట్టించుకోకపోవడం, అధికారులతో కుమ్మక్కై నిబంధనలు పాటించకపోవడంతో స్థానికంగా ఉన్న నలుగురు ఓ లీగల్ కమిటీగా ఏర్పడి సూపర్ టెక్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీం కోర్టు 40 అంతస్తుల జంట భవనాలను కూల్చివేయాలని గతేడాది ఆగస్టులో ఆదేశాలు ఇచ్చింది. ఇదే సమయంలో టవర్స్లో ప్లాట్లు కొన్న వారందరికీ 12శాతం వడ్డీతో డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆదేశించింది.