న్యూఢిల్లీ: గడువు ముగిసిన బ్రాండెడ్ ఆహార ఉత్పత్తుల తయారీ లేబుల్స్, గడువు తేదీలను మార్చి, వాటిని తిరిగి ప్యాక్ చేస్తున్న ముఠాగుట్టును పోలీసులు రట్టు చేశారు. రూ.20 లక్షలకు పైగా విలువైన ఆహార ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురిని అరెస్ట్ చేశారు. (Expired Food Racket Busted) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఒక ఫ్యాక్టరీలో బాల కార్మికులు ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో ఢిల్లీ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు, బదర్పూర్ సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్, మిషన్ ముక్తి అనే స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఓఖ్లా ఫేజ్-2 లోని మెస్సర్స్ వెస్టెండ్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాంగణంలో సోదాలు చేశారు.
కాగా, అక్కడ బాల కార్మికులు ఎవరూ కనిపించలేదు. అయితే గడువు ముగిసిన, గడువు ముగియబోతున్న ఆహార ఉత్పత్తులను తక్కువ ధరకు కొనుగోలు చేసి కొత్త లేబుళ్లు వేసి, వాటిని తిరిగి ప్యాక్ చేసి పెద్ద ఎత్తున్న అమ్ముతున్న ముఠాగుట్టు బయటపడింది. దీంతో రూ.20 లక్షలకు పైగా విలువైన ఆహార ఉత్పత్తులను సీజ్ చేశారు. ఉత్పత్తి లేబుళ్లను మార్చడానికి వినియోగించే ప్రింటింగ్ యంత్రాలు, సీలింగ్ పరికరాలు, స్టాంపులు, రసాయన ద్రావకాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు అక్రమ రీప్యాకేజింగ్, గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల అమ్మకాలపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఏడుగురు నిందితులైన కంపెనీ యజమాని 70 ఏళ్ల దర్శన్ సింగ్ సచ్దేవా, మేనేజర్ నితేష్ భరద్వాజ్, అకౌంటెంట్ నరేందర్ కుమార్, ఆపరేటర్ కపిల్, వేర్హౌస్ కీపర్ లక్కీ ఓఝా, సూపర్వైజర్లు ప్రేమ్ యాదవ్, పవన్ కుమార్ యాదవ్ను అరెస్ట్ చేశారు. ఈ ముఠా నెట్వర్క్, కార్యకలాపాలపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.