Exit Polls : పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళం, పుదుచ్చేరి, అసోం సహా ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలు బుధవారంతో ముగిశాయి. మే 4న ఫలితాలు వెల్లడవుతాయి. ఈ ఎన్నికల్లో ఎక్కువగా ప్రాంతీయ పార్టీల హవానే కనిపించింది. జాతీయ పార్టీల్లో బీజేపీ మాత్రమే ఈ ఎన్నికల్లో ప్రభావం చూపింది. అసోం, కేరళంలో మినహా కాంగ్రెస్ ప్రభావం పెద్దగా కనిపించలేదు.
ఈ నేపథ్యంలో ఏ రాష్ట్రంలో బీజేపీ ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇవి. ఈ ఐదు రాష్ట్రాల్లో బీజేపీ అత్యంత బలహీనంగా ఉన్నది కేరళంలో. ఇక్కడ ఈ సారి కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ విజయం సాధించే అవకాశాలున్నాయి. అధికార ఎల్డీఎఫ్ గట్టి పోటీ ఇస్తుంది. ఇక్కడ బీజేపీకి 10–14 సీట్ల వరకు మాత్రమే వచ్చే అవకాశాలున్నాయి. అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదు. తమిళనాడులో ఏఐఏడీఎంకే కూటమిగా బీజేపీ పోటీ చేసింది. ఇక్కడ కూడా బీజేపీకి అధికారం వచ్చే అవకాశాలు లేవని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. తమిళనాడులో గట్టి పోటీ ఉన్నప్పటికీ డీఎంకే కూటమికి విజయావకాశాలున్నట్లు అంచనా.
అయితే, తమిళనాడులో గతంలోకంటే మెరుగైన ఫలితాలు రావొచ్చు. ఇక, అసోంలో ఈసారి కూడా బీజేపీకే అధికారం దక్కే ఛాన్స్ ఉంది. పుదుచ్చేరిలో మాత్రం బీజేపీ అధికారం చేపట్టే అవకాశాలున్నాయి. అలాగే, పశ్చిమ బెంగాల్లో మాత్రం ఈసారి బీజేపీ అధికారం చేపట్టే అవకాశాలున్నట్లు అనేక ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది మాత్రం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంనే. ఇక్కడ విజయం సాధించే అవకాశాలుండటం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం.