Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ఫలితాలపై పలు సర్వే సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) అంచనాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తోసిపుచ్చారు. ఆ ఎగ్జిట్పోల్స్ పూర్తిగా బూటకమని, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ.. సర్వే సంస్థలకు డబ్బులు ఇచ్చి తమకు అనుకూలంగా అంచనాలను రాయించుకుందని ఆమె ఆరోపించారు. తమ పార్టీ కార్యకర్తలను నిరుత్సాహపరిచేందుకే వారు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీదే విజయమని మమతాబెనర్జి ధీమా వ్యక్తంచేశారు. మెజార్టీ ఫిగర్ దాటి 226 సీట్లలో టీఎంసీ విజయం సాధిస్తుందని చెప్పారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులను ఉద్దేశించి ఆమె వీడియో సందేశం విడుదల చేశారు. కౌంటింగ్ రోజున అందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని వారికి మమత సూచించారు. మే 4న నిర్వహించే ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో తన సొంత నియోజకవర్గమైన భవానీపుర్లో తాను కాపలా కాస్తానని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ కార్యకర్తలు, క్షేత్రస్థాయి నాయకులు అన్ని లెక్కింపు కేంద్రాల్లో 24 గంటలపాటు నిఘా పెట్టాలని మమతాబెనర్జి సూచించారు. లెక్కింపు జరిగే సమయంలో కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కౌంటింగ్ సందర్బంగా అక్రమాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.