కరోనా వేళ దేశంలో జరిగిన మినీ ఎన్నికల సంగ్రామం.. గురువారం బెంగాల్ చివరిదశ పోలింగ్తో ముగిసింది. ఆ వెంటనే ఎగ్జిట్పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. హోరాహోరీ పోరాటంతో యావత్దేశం చూపునూ తనవైపు తిప్పుకొన్న పశ్చిమబెంగాల్లో ఫలితం కూడా అదే స్థాయి ఉత్కంఠను కలిగిస్తుందని ఎగ్జిట్పోల్స్ తేల్చిచెప్పాయి. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రతీ సీటు కోసం పోరాటం హోరాహోరీగా ఉన్నందున ఈ రెండు పార్టీల్లో ఏదైనా విజేత కావచ్చని పేర్కొన్నాయి.
బెంగాల్ తర్వాత దక్షిణాదిన ఆసక్తి కలిగించిన తమిళనాట ఈసారి డీఎంకేదే హవా అని, ద్రవిడ దిగ్గజం కరుణానిధి తనయుడు స్టాలిన్ తొలిసారిగా సీఎం పదవిని చేపట్టడం ఖాయమని దాదాపుగా అన్ని సర్వేలూ తేల్చిచెప్పాయి. కేరళలో ప్రతి ఐదేండ్లకోసారి అధికారం చేతులుమారే సంప్రదాయం ఈసారి పునరావృతం కాదని, వరుసగా రెండోసారి పినరాయి విజయన్ సారథ్యంలో ఎల్డీఎఫ్ కూటమి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని సర్వేలు ప్రకటించాయి. అస్సాంను బీజేపీ తిరిగి నిలబెట్టుకుంటుందని, పుదుచ్చేరిలో సైతం ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని అంచనా వేశాయి.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: ఇటీవలి కాలంలో ఎన్నడూ చూడనంతటి హోరాహోరీ ఎన్నికల సమరానికి వేదికగా నిల్చిన పశ్చిమబెంగాల్లో ఫలితం కూడా అదేస్థాయిలో దోబూచులాడనున్నది. నువ్వానేనా అన్నట్లు తలపడిన తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల్లో ఎవరినైనా విజయం వరించవచ్చని ఎగ్జిట్స్పోల్స్ జోస్యం చెప్పాయి. బెంగాల్లో చివరిదైన ఎనిమిదోదశ పోలింగ్ గురువారం ముగియటంతో.. పుదుచ్చేరితోపాటు నాలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పలు జాతీయ టీవీ చానళ్లు, వార్తాసంస్థలు ఎన్నికల ఫలితాల అంచనాలను విడుదల చేశాయి. వీటి ప్రకారం.. బెంగాల్ తర్వాత ఆ స్థాయిలో ఆసక్తి రేపిన తమిళనాడులో పదేండ్ల విరామం తర్వాత డీఎంకే అధికారంలోకి రానుంది. స్టాలిన్ తొలిసారిగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్నారు. కేరళలో విజయన్ సారథ్యంలో వామపక్ష కూటమి తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోనుంది. అస్సాంలో అధికారంలో ఉన్న బీజేపీ తిరిగి విజయకేతనాన్ని ఎగురవేస్తుందని, పుదుచ్చేరిలో కూడా బీజేపీ, ఆ పార్టీ భాగస్వామ్యపక్షాలతో కూడిన ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్పోల్స్ పేర్కొన్నాయి. ఈ ఫలితాలు కాంగ్రెస్కు మరోసారి ఆశనిపాతం కానున్నాయి. అస్సాం, కేరళలో ఎంత చెమటోడ్చినా ఆ పార్టీకి పరాజయమే మిగులనుందని, ఇటీవలి వరకూ అధికారంలో ఉన్న పుదుచ్చేరిని కూడా కోల్పోనుందని ఎగ్జిట్పోల్స్ అంచనాలు తెలిపాయి.
బెంగాల్: అదే ఉత్కంఠ
బెంగాల్ను ఈసారి ఎలాగైనా మమత నుంచి కైవసం చేసుకోవాలని, ఆ రాష్ట్ర అధికారపీఠంపై కాషాయకేతనాన్ని తొలిసారిగా ఎగురవేసి సంచలనం సృష్టించాలని ప్రధాని మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్షా సర్వశక్తులూ ఒడ్డారు. వారి ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయని కొన్ని ఎగ్జిట్పోల్స్ పేర్కొన్నాయి. 292 సీట్ల బెంగాల్ అసెంబ్లీలో కనీస మెజారిటీ 147కాగా.. జన్కీబాత్ సర్వే బీజేపీకి 162-185 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అలాగే, రిపబ్లిక్-సీఎన్ఎక్స్ మై ఇండియా బీజేపీకి 138-148 సీట్ల వరకూ రావచ్చని పేర్కొంది. మరోవైపు, తృణమూల్కు స్పష్టమైన మెజారిటీ లభిస్తుందని టైమ్స్నౌ-సీఓటర్ సర్వే వెల్లడించింది. దీనిప్రకారం.. తృణమూల్కు 158, బీజేపీకి 115 సీట్లు లభిస్తాయి. కాగా, మెజారిటీ సర్వేలు మాత్రం బీజేపీ, తృణమూల్ మధ్య తీవ్రమైన పోటీ ఉండనుందని పేర్కొన్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించిన పోల్ ఆఫ్ ఎగ్జిట్పోల్స్ ప్రకారం.. తృణమూల్కు 143, బీజేపీకి 133 సీట్లు దక్కనున్నాయి.
తమిళనాడు: డీఎంకే
ఉద్ధండ నేతలు కరుణానిధి, జయలలిత లేకుండా తమిళనాడులో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ప్రభంజనం వీయనుందని సర్వేలు పేర్కొన్నాయి. కరుణానిధి కుమారుడు స్టాలిన్ నాయకత్వంలో దశాబ్దకాలం తర్వాత పార్టీ భారీ మెజార్టీతో అధికారంలోకి రానుందని తెలిపాయి. 234 సీట్ల అసెంబ్లీలో డీఎంకే-కాంగ్రెస్ కూటమికి 175-195 సీట్లు రావొచ్చని, అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి కేవలం 38-54 సీట్లు మాత్రమే వస్తాయని యాక్సిస్ మై ఇండియా అంచనాలు పేర్కొన్నాయి. సీఎన్ఎక్స్ సర్వే ప్రకారం.. డీఎంకే కూటమికి 160-170 సీట్లు, అన్నాడీఎంకే కూటమికి 58-68 సీట్లు వచ్చే అవకాశం ఉంది.
అస్సాం: మరోసారి కాషాయజెండా
126 సీట్ల అస్సాం అసెంబ్లీలో బీజేపీ రెండోసారి వరుసగా అధికారంలోకి రానుందని సర్వేలు పేర్కొన్నాయి. అస్సాంను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ చెమటోడ్చినప్పటికీ.. ఆ పార్టీకి విజయావకాశాలు లేవని తెలిపాయి. ఇండియాటుడే-యాక్సిస్ మై ఇండియా అంచనాల ప్రకారం బీజేపీ కూటమికి 75-85 స్థానాలతో మంచి మెజారిటీనే లభించే అవకాశం ఉంది. కాంగ్రెస్ 40-50 స్థానాలకు పరిమితం కానుంది. టుడేస్ చాణక్య సర్వే ప్రకారం బీజేపీ కూటమికి 61-79 సీట్లు, కాంగ్రెస్ కూటమికి 47-65 సీట్లు రావచ్చు.
కేరళలో ఎల్డీఎఫ్కే మళ్లీ ఎర్రతివాచీ
కేరళలో ప్రతి ఐదేండ్లకోమారు ఎన్నికల్లో అధికార పార్టీ గద్దెదిగి ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వస్తుంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని ఈసారి విజయన్ సారథ్యంలోని ఎల్డీఎఫ్ బ్రేక్ చేస్తుందని ఎగ్జిట్ అంచనాలు చెబుతున్నాయి. 140 సీట్ల అసెంబ్లీలో వామపక్షకూటమి 104 సీట్ల వరకూ గెల్చుకొని ఘన విజయం సాధిస్తుందని యాక్సిస్ మై ఇండియా సర్వే పేర్కొంది. టుడేస్ చాణక్య అంచనాల ప్రకారం.. ఎల్డీఎఫ్కు 93-111 స్థానాలు రానున్నాయి. కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కేవలం 26-44 సీట్లకే పరిమితమవుతుందని ఈ సర్వే పేర్కొంది.
ముగిసిన బెంగాల్ పోరు
కోల్కతా, ఏప్రిల్ 29: దాదాపు నెల రోజులపాటు కొనసాగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు గురువారం ముగిశాయి. చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ విడుతలో 35 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. దాదాపు 80 శాతం పోలింగ్ నమోదైంది. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.