న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీచేసింది. ఈ నెల 17న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. మనీలాండరింగ్ కేసులో తాము జారీ చేసిన సమన్లను కేజ్రీవాల్ పట్టించుకోకపోవటంతో ఈడీ ఢిల్లీ కోర్టుకు ఫిర్యాదు చేసింది. దీనిపై బుధవారం విచారణ జరిపిన కోర్టు.. కేజ్రీవాల్కు సమన్లు జారీచేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్కు ఈడీ ఐదుసార్లు సమన్లు జారీచేసినప్పటికీ ఆయన హాజరుకాలేదు. ఈడీ సమన్లు రాజకీయ ప్రేరేపితమైనవని, చట్టవిరుద్ధమైనవని ఆయన ఆరోపించారు. తనను ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకే సమన్లు పంపారని ఆరోపించారు.
17న హాజరు కావాలని ఢిల్లీ కోర్టు పంపిన సమన్లపై ఆమ్ఆద్మీ పార్టీ స్పందించింది. ఢిల్లీ కోర్టు ఆదేశాలను అధ్యయనం చేస్తున్నామని తెలిపింది. ఎక్సైజ్ పాలసీ కేసులో ఈడీ పలుమార్లు పంపిన నోటీసులు చట్టవిరుద్దమని పార్టీ కూడా కేజ్రీవాల్ని సమర్థించింది. తమ అభిప్రాయాన్ని కోర్టుకు తెలియచేస్తామని ఆప్ నాయకుడు జాస్మిన్ షా విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.
కేజ్రీవాల్ పీఏ భిభవ్ కుమార్ ఇంట్లో ఈడీ అధికారులు ఎలాంటి సోదాలు నిర్వహించలేదని ఆప్ మంత్రి ఆతిశీ తెలిపారు. కనీసం కుమార్ ఇంట్లో సోదాలు చేసినట్టు కూడా నటించలేదని ఆమె వెల్లడించారు. ఈడీ అధికారులు భిభవ్ కుమార్ ఇంట్లో గదుల్లో వెతికింది పత్రాల కోసం కాదని, అసలు వారు ఏ కేసుకు సంబంధించి వచ్చారో కూడా తెలియచేయలేదని ఆమె విలేకరులకు వివరించారు. ఆప్ మంత్రి ఆతిశీ చేసిన ఆరోపణలపై ఈడీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఢిల్లీ జల్ బోర్డు టెండర్ ప్రక్రియలో అక్రమాలకు సంబంధించి ఈ దాడులు జరిగాయని మాత్రం ఈడీ వర్గాలు తెలిపాయి.