Electoral Bonds : ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ప్రజాస్వామ్యానికి మేలు చేస్తుందని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్వై ఖురేషీ గురువారం స్వాగతించారు. ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధమని, భావప్రకటనా స్వేచ్ఛ, సమాచార హక్కుకు ఉల్లంఘన అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.
రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చే వారి పేర్లతో కూడిన వివరాలను ఎన్నికల కమిషన్కు అందించాలని ఎస్బీఐని కోరింది. ఈ తీర్పు ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరిస్తుందని, గత కొన్నేండ్లలో సుప్రీంకోర్టు నుంచి వచ్చిన చారిత్రాత్మక తీర్పు ఇదని, ఇది ప్రజాస్వామ్యానికి ఊతం ఇస్తుందని ఖురేషీ పేర్కొన్నారు.
ఈ విషయంపై తామంతా చాలా ఏండ్లుగా కలత చెందుతున్నామని, తాము లేవనెత్తిన ప్రతి అంశం తీర్పులో ప్రతిబింబించిందని మాజీ సీఈసీ వివరించారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. రాజకీయ పార్టీలు అందుకునే విరాళాల్లో పారదర్శకతను తీసుకువచ్చే క్రమంలో నగదు విరాళాలకు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం 2018 జనవరి 2న ప్రత్యామ్నాయంగా ఎలక్టోరల్ బాండ్స్ను ప్రవేశపెట్టింది.
Read More :