న్యూఢిల్లీ / కాఠ్మండు: అమెరికాకు అక్రమంగా తరలించే ముఠా 11 మంది భారతీయులను నేపాల్లో బంధించింది. ఈ విషయం తెలుసుకున్న ఆ దేశ పోలీసులు ఒక ఇంటిపై రైడ్ చేశారు. ఆ ముఠా బంధించిన భారతీయులను రక్షించారు. (US bound Indians rescued) ఢిల్లీ, హర్యానాకు చెందిన సుమారు 11 మంది అక్రమ మార్గంలో అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించారు. దీని కోసం ఒక ముఠాకు ఒక్కొక్కరు రూ.45 లక్షల చొప్పున చెల్లించారు. ఆ ముఠా సభ్యులు 11 మంది భారతీయులను నేపాల్కు తరలించారు. అక్కడి నుంచి అమెరికాకు పంపుతామని నమ్మించారు. గత నెల రోజులుగా ఒక ఇంట్లో వారిని బంధించారు.
కాగా, నేపాల్ పోలీసులకు ఈ విషయం తెలిసింది. దీంతో రాజధాని కాఠ్మండులోని రాటోపుల్ ప్రాంతంలో ఉన్న ఆ ఇంటిపై రైడ్ చేశారు. బందీలుగా ఉన్న 11 మంది భారతీయులను రక్షించారు. ఆ ముఠాకు చెందిన ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఆ ముఠా మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నదని నేపాల్ పోలీస్ అధికారి ఆరోపించారు. నేపాల్ మీదుగా అమెరికా తరలించేందుకు ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.45 లక్షల చొప్పున వసూలు చేసినట్లు తమకు తెలిసిందని చెప్పారు. ఈ సంఘటనపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.