న్యూఢిల్లీ: సంఖ్య తగ్గుతున్నప్పటికీ డంకీ మార్గం ద్వారా అమెరికాలోకి భారతీయుల అక్రమ ప్రవేశం కొనసాగుతూనే ఉంది. 2025వ సంవత్సరంలో ఈ మార్గం ద్వారా ప్రయాణించి అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించాలని ప్రయత్నించిన మొత్తం 23,830 మంది భారతీయులను (రోజుకు సరాసరి 65 మంది చొప్పున) అరెస్టు చేసినట్లు అమెరికా బార్డర్ అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ తన తాజా నివేదికలో వెల్లడించింది.
గతంతో పోలిస్తే అక్రమ ప్రవేశాలు తగ్గినప్పటికీ అవి పూర్తిగా ఆగిపోలేదని అధికారులు తెలిపారు. 2024లో జో బైడెన్ హయాంలో 85,119 మంది భారతీయులను నిర్బంధించినట్లు వారు చెప్పారు. అక్రమ వలసదారుల వైఖరిలో కూడా మార్పు వచ్చిందని అధికారులు అభిప్రాయపడ్డారు. 2025లో అరెస్టయిన భారతీయులలో ఒక్కరి వెంట కూడా కుటుంబం లేదని, అందరూ ఒంటరిగానే ప్రయాణిస్తున్నారని అధికారులు వివరించారు. 2024తో పోలిస్తే ఇది పెనుమార్పుగా వారు అభివర్ణించారు.