న్యూఢిల్లీ, డిసెంబర్ 12: దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నా, నిరుద్యోగం అకాశన్నంటుతున్నా, రూపాయి విలువ పడిపోతున్నా.. కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు అయినా లేదని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఆయా సమస్యల పరిష్కారానికి ఏవిధమైన చర్యలు తీసుకోలేదని విమర్శించాయి. సప్లిమెంటరీ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్పై సోమవారం లోక్సభలో జరిగిన చర్చ సందర్భంగా ప్రతిపక్ష పార్టీల ఎంపీలు మోదీ సర్కార్ తీరును ఎండగట్టాయి. టీఎంసీ ఎంపీ సౌగతారాయ్ మాట్లాడుతూ దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం విస్తృత పరిష్కారాలతో ముందుకు రావాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.
ఉపాధి హామీ పథకం కింద పశ్చిమబెంగాల్కు రావాల్సిన రూ.7,300 కోట్ల బకాయిలు విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు. ఇటీవల ట్విట్టర్, మెటా వంటి సంస్థల్లో చోటుచేసుకొంటున్న ఉద్యోగాల కోత, భారత ఐటీ పరిశ్రమపై ప్రభావం చూపే అవకాశం ఉన్నదని అభిప్రాయపడ్డారు. భారత ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను పలు అంతర్జాతీయ సంస్థలు, రేటింగ్ ఏజెన్సీలు తగ్గించాయని కాంగ్రెస్ ఎంపీ కే సురేశ్ గుర్తుచేశారు.
ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం రాజ్యమేలుతున్నదని, పట్టణాల్లో కూడా ఉద్యోగాలు లేకపోవడం ఆందోళనకరమని అన్నారు. నోట్లరద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలు చిన్న, మధ్యతరహా పరిశ్రమలను దెబ్బతీశాయని ఎన్సీపీ ఎంపీ పీపీ ఫైజల్ విమర్శించారు. కొవిడ్తో నష్టపోయిన రైతులకు కేంద్రం ఎటువంటి పరిహారం ఇవ్వలేదని బీఎస్పీ ఎంపీ మలూక్ నాగర్ ఆక్షేపించారు. చెరకు ధరలను క్వింటాల్కు రూ.500 పెంచాలని డిమాండ్ చేశారు.