పాట్నా: బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయినప్పటికీ ఆ రాష్ట్ర ప్రజలపై తమకు ప్రేమ ఉన్నదని సీఎం నితీశ్ కుమార్ అన్నారు. 2000లో బీహార్ విభజన జరిగినప్పటికీ బీహార్, జార్ఖండ్ ప్రజలకు ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నదని అన్నారు. రాజకీయంగా ప్రజలు ఏమీ అనుకున్నప్పటికీ రెండు రాష్ట్రాల ప్రజలు ఒకటిగా ఉంటారని చెప్పారు. జార్ఖండ్ విడిపోయినప్పటికీ వారిపై తమకు ప్రేమ ఉందన్నారు. ఈ విషయం ఎప్పుడూ మరిచిపోకూడదని అన్నారు. బీహార్, జార్ఖండ్ ప్రజలు సోదరులని, ఒకే కుటుంబానికి చెందినవారని వ్యాఖ్యానించారు. బీహార్, జార్ఖండ్పై ఒకరి గురించి ఒకరు వ్యాఖ్యలు చేసుకోవాల్సిన అవసరం లేదని, ఒకరిపై మరొకరికి ప్రేమ మాత్రమే ఉన్నదని నితీష్ కుమార్ అన్నారు.
భోజ్పురి, మగాహి ప్రాంతీయ భాషలు కాదని అరువు తెచ్చుకున్న భాషలని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఇటీవల వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం గిరిజన సమాజం పోరాడింది ప్రాంతీయ, గిరిజన భాషల కోసమేనని, భోజ్పురి లేదా మగాహి కోసం కాదన్నారు. ‘స్థానిక ప్రజలు బలహీనంగా ఉన్నప్పుడు ఆ రెండు భాషలను మాట్లాడే వ్యక్తులు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. కొందరు శక్తివంతమైన వ్యక్తుల భాషను ఉపయోగించడం ప్రారంభించారు’ అని వ్యాఖ్యానించారు.
జార్ఖండ్ ఉద్యమ సమయంలో ప్రజలను హింసించారని, మహిళలపై అత్యాచారాలు చేశారని, భోజ్పురిలో వారిని హేళన చేసి హింసించేవారని సోరెన్ ఆరోపించారు. అలా హింసకు గురైన చాలామంది పురుషులు, మహిళలు ఇంకా సజీవంగా ఉన్నారని ఒక న్యూస్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ నేపథ్యంలో భోజ్పురి, మగాహి బీహార్ భాషలని పేర్కొన్న ఆయన జార్ఖండ్లో బీహారికరణ్కు అనుమతించబోమన్నారు.
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ సోమవారం ఈ మేరకు స్పందించారు.