(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): అర్హులైన వారికి అధిక పింఛన్ చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించి 17 నెలలు గడుస్తున్నప్పటికీ.. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్లో చలనం లేదు. దీంతో ఉద్యోగులు, పెన్షనర్ల పట్ల కేంద్రం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై ఉద్యోగ, కార్మిక సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. అధిక పెన్షన్ కోసం ఉద్యోగులు, కార్మిక సంఘాలు ఏండ్ల తరబడి చేస్తున్న న్యాయ పోరాటం ఫలితంగా ఎట్టకేలకు 2022 నవంబర్లో సుప్రీంకోర్టు వారికి అనుకూలంగా తీర్పునిచ్చింది.
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే అర్హులైన కార్మికులు, ఉద్యోగులకు అధిక పింఛను చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు అధిక పింఛన్కు అర్హులైన వారి నుంచి ఈపీఎఫ్వో దరఖాస్తులు స్వీకరించింది. దేశవ్యాప్తంగా 17.48 లక్షల మంది దరఖాస్తు చేసుకొన్నారు. అయితే వాటిని పరిశీలించి అధిక పింఛన్ చెల్లించడానికి చర్యలు చేపట్టాల్సిన ఈపీఎఫ్వో.. మార్గదర్శకాల పేరిట అనేక కొర్రీలు పెడుతున్నదని పింఛనుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారి ఒకరు స్పందిస్తూ… ఈపీఎఫ్లో సిబ్బంది కొరత వల్ల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ నెమ్మదిగా సాగుతున్నదని చెప్పారు. తమ సిబ్బంది లోక్సభ ఎన్నికల విధులను కూడా నిర్వహిస్తుండటంతో ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరికొంత సమయం పట్టొచ్చని తెలిపారు.