న్యూఢిల్లీ: ఈ సంవత్సరంలో అయిదు నెలలు పూర్తి కాక ముందే 92 వేల మంది టెక్ వర్కర్లు ఉద్యోగాలను కోల్పోయారు. నిరుడు రెండేండ్లతో పోలిస్తే గత నెలలో ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్యే (45 వేలు) ఎక్కువ. మెటా, స్నాప్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, అమెజాన్, నైక్, గోప్రో లాంటి ప్రముఖ కంపెనీలన్నీ ఏఐకి ప్రాధాన్యత ఇస్తూ ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి. మే 20న తమ కంపెనీలో 10 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్టు మెటా గత నెలలోనే ప్రకటించింది. మరోవైపు 6 వేల ప్రవేశ స్థాయి ఉద్యోగాలను భర్తీ చేయకుండా వదిలేసినట్టు ఆ సంస్థ తెలిపింది. స్నాప్చాట్ మాతృ సంస్థ స్నాప్ వెయ్యి మంది ఉద్యోగులను త్వరలో తొలగించనున్నది.
మైక్రోసాఫ్ట్ అయితే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా 8,750 మంది ఉద్యోగులను ఇంటికి పంపనుంది. మరోవైపు అమెజాన్ ఆరు నెలల్లో విడతల వారీగా 30 వేల కార్పొరేట్ ఉద్యోగులను లే ఆఫ్ చేసింది. అధికారుల వ్యవస్థను తగ్గించుకోవడానికి ఈ పని చేసినట్టు వెల్లడించింది. మార్చి 31న చాలా మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ఒరాకిల్ పంపిన ఈ మెయిళ్లు తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాయి. బ్లాక్ ఐఎన్సీ కంపెనీ తన శ్రామిక శక్తిలో 40 శాతం మందిని తగ్గించుకోనేందుకు ప్రణాళికలు రూపొందించింది.
క్లాడ్, చాట్జీపీటీ లాంటి అప్లిక్లేషన్లు కొన్ని పనులను పూర్తిగా ఆటోమేషన్ ద్వారా పూర్తి చేసి చూపిస్తున్నాయి. దీంతో ఉద్యోగులకు తమ కొలువులపై బెంగ ఎక్కువైంది. సీఎన్బీసీ నివేదిక ప్రకారం.. నిరుటితో పోలిస్తే సాంకేతిక రంగ ఉద్యోగుల విశ్వాస సూచిక 6.8 శాతం తగ్గి మార్చి నాటికి 47.2 శాతానికి చేరుకున్నది. మార్కెట్, ఉద్యోగ అస్థిరత కారణంగా కొందరు స్వచ్ఛందంగా ఉద్యోగాలను వదిలేస్తున్నారు. దీంతో కంపెనీలు మరింత దూకుడుగా వ్యవహరిస్తూ ఉద్యోగుల పనితీరును కఠినంగా విశ్లేషిస్తున్నాయి.
భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న పెద్ద కంపెనీలు మరోవైపు కృత్రిమ మేధపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఆల్ఫాబెట్, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ కలిపి ఈ సంవత్సరం సుమారు రూ.55.94 లక్షల కోట్లను ఏఐ అభివృద్ధి, సేవల కోసం ఖర్చు చేశాయి. గత రెండేండ్లలో ఈ కంపెనీలన్నీ ఖర్చు పెట్టిన మొత్తానికి ఇది రెండింతలు. ఏఐ సేవల కోసం ఈ కంపెనీలన్నీ ఈ సంవత్సరంలో రూ.58.10 లక్షల కోట్లను ఖర్చు పెట్టనున్నాయి.