న్యూఢిల్లీ : ఇథనాల్ పెట్రోల్ వల్ల ఇప్పటికే సామాన్యుడి జేబుకు భారీగా చిల్లు పడుతున్నది. ఓ వైపు చక్కెర ధర పెరగ్గా.. ఇప్పుడు కోడిగుడ్డు కూడా కొండెక్కింది. ఫామ్గేట్ వద్ద కోడిగుడ్డు ధర రూ.7 ఉంటే.. రిటైల్ మార్కెట్లో రూ.8.50 నుంచి రూ.9 దాకా ఉంది. అంటే 40శాతం ధర పెరిగింది. రాబోయేది చలికాలం కాబట్టి గుడ్లకు భారీ డిమాండ్ ఉంటుంది. తక్కువ ధరలో అందే ప్రొటీన్గా కోడిగుడ్డుకు పేరున్నది. ఈ లెక్కన సామాన్యుడిపై మరింత భారం పడుతుందని సోషల్ మీడియాలో పోస్టులు వస్తున్నాయి. దీనంతటికీ ఇథనాల్ పెట్రోలే కారణం అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఇథనాల్ తయారీకి చెరుకు పంటతో పాటు మక్క జొన్నను కూడా వాడుతున్నారు. అందుకే ఈ విధంగా ధరలు పెరుగుతున్నాయనే వాదనలు తెరమీదకొస్తున్నాయి.
భారీగా పెరిగిన మక్కజొన్న వాడకం..
నిపుణుల సమాచారం ప్రకారం.. పౌల్ట్రీ ఫీడ్లో 50-55శాతం దాకా మక్కజొన్నను వాడుతారు. మిగతాది సోయాబిన్. అయితే పౌల్ట్రీల్లో వాడే మక్కజొన్నను ఇథనాల్ తయారీ కేంద్రాలకు తరలించడంతో దాని ధర పెరుగుతున్నది. ఫీడ్ ధర పెరగడంతో గుడ్ల ధరలు పెరుగుతున్నాయి. 2025లో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీశాఖ సహాయ మంత్రి నిముబెన్ జయంతిభాయ్ బంభానియా లోక్సభలో వెల్లడించిన వివరాల ప్రకారం.. 2024-25లో 125.75 లక్షల మెట్రిక్ టన్నుల మక్కజొన్న ఇథనాల్ ఉత్పత్తికి వినియోగించారు. అదే ఏడాదిలో మక్కజొన్న ఆధారిత డిస్టిలరీలకు 477.8 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తికి కేటాయించారు. కేవలం రెండేండ్లలో ఇథనాల్ తయారీ కోసం మక్కజొన్న వినియోగం 8.3 లక్షల టన్నుల నుంచి 125.75 పెరిగింది. 2025-26లో కూడా 125.78 లక్షల టన్నుల మొక్కజొన్నను ఇథనాల్కు కేటాయించారు.