ఢిల్లీ ,జూన్ 9:పర్యావరణానికి హాని కలిగించనిఉత్పత్తులను ప్రోత్సహించడంతోపాటు, ప్లాస్టిక్ ఉత్పత్తుల వినియోగాన్నిక్రమంగా తగ్గించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ప్లాస్టిక్ 20వ శతాబ్దికి చెందిన ఉపయోగకరమైన ఇన్నోవేషన్ అయినప్పటికీ ప్లాస్టిక్ పర్యావరణానికి తీవ్రమైన ముప్పుగా మారిందని ఆయన తెలిపారు. “భూమితోపాటు, జలవనరులకు ప్లాస్టిక్ కలిగిస్తున్న ప్రతికూల ప్రభావాలను పరిగణనలోకి తీసుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2022 నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను పూర్తిగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం కూడా ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణకు సమర్థవంతమైన చర్యలు తీసుకుంది” అని జవదేకర్ అన్నారు.
ప్రభుత్వం ఇప్పటికే ప్లాస్టిక్ వ్యర్థాలను దేశంలోకి దిగుమతి చేసుకోవడాన్ని నిషేధించిందని, పర్యావరణానికి ఎలాంటి హాని కలగని విధంగా ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలించేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు-2016ను ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.”ఆ నిబంధనల కింద 50 మైక్రాన్ల కన్నా తక్కువ సాంద్రత గల ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ లను నిషేధించడం జరిగింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాయి. అలాగే ఉపయోగించి పడేసే ప్లాస్టిక్ వస్తువులు సహా 12 రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను నిషేధిస్తూ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు-2016ని సవరించాలని 2021 మార్చిలోమంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ కూడా జారీ చేసింది” అని జవదేకర్ అన్నారు.