Rammandir | యావత్ దేశమంతా సోమవారం అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట కోసం సిద్ధమైంది. మరోవైపు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. యావత్ భారతీయులంతా గర్వించదగ్గ ఈ వేడుకలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోదీ తదితర ప్రముఖులంతా ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న అయోధ్య రామ మందిరం డిజైనింగ్తోపాటు నిర్మాణం చేపట్టిన ఘనత ప్రముఖ కార్పొరేట్ సంస్థకు దక్కుతుంది. అదే లార్సెన్ అండ్ టర్బో (ఎల్ అండ్టీ). ఆ సంగతి స్వయంగా ఎల్ అండ్ టీ ఆదివారం వెల్లడించింది.
శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ అనుమతితో అయోధ్యలో శ్రీరామ జన్మభూమి ఆలయాన్ని డిజైన్ చేయడంతోపాటు విజయవంతంగా నిర్మించినట్లు ఎల్ అండ్ టీ తెలిపింది. శ్రీరామజన్మభూమి ఆలయన నిర్మాణంలో తమ వాస్తు వైభవం కొత్త మైలురాయిని నమోదు చేసిందని ఓ ప్రకటనలో పేర్కొంది.
70 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన దేవాలయం పురాతన నగర సంస్కృతిని ప్రతిబింబించేలా అర్కిటెక్చర్లు డిజైన్ చేశారు. వెయ్యేండ్లు మన్నికగా ఉండేలా 161.75 అడుగుల ఎత్తున, 380 అడుగుల పొడవు, 249.5 అడుగుల వెడల్పు విస్తీర్ణంలో నిర్మించారు. మూడంతస్తుల భవనంతో కూడిన ఈ దేవాలయంలో ఐదు మండపాలు ఉంటాయి. ప్రధాన శిఖరంతోపాటు నృత్య మండపం, రంగ్ మండపం, గుడ్ మండపం, కీర్తన మండపం, ప్రార్థనా మండపం ఉంటాయి.
`శ్రీ రామజన్మభూమి దేవాలయం డిజైనింగ్, నిర్మాణంలో భాగస్వామ్యం కల్పించినందుకు ప్రభుత్వానికి మేం హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం` అని ఎల్ అండ్ టీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎన్ సుబ్రమణ్యన్ తెలిపారు. 50 ఏశాలకు పైగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ ఎల్ అండ్ టీ. ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, నిర్మాణ ప్రాజెక్టులు, హైటెక్ మాన్యుఫాక్చరింగ్, సర్వీసుల రంగంలో అందె వేసిన సంస్థ ఇది.