న్యూఢిల్లీ, అక్టోబర్ 4: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆప్ కీలక నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ను అరెస్టు చేసింది. మనీల్యాండరింగ్ ఆరోపణలపై బుధవారం ఉదయం నుంచి ఢిల్లీలోని ఎంపీ నివాసంలో అధికారులు సోదాలు చేపట్టారు. దాదాపు 10 గంటలపాటు ప్రశ్నించిన అనంతరం పీఎంఎల్ఏ కింద అరెస్టు చేసినట్టు అధికారులు సాయంత్రం ప్రకటించారు. సంజయ్ సింగ్ను గురువారం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నదని, ఈడీ కస్టడీ కోరే అవకాశం ఉన్నదని సంబంధిత వర్గాలు తెలిపాయి. తన రెస్టారెంట్లో ఓ పార్టీ సందర్భంగా ఎంపీ సంజయ్ సింగ్ను కలిశానని ఎక్సైజ్ పాలసీ కేసులో అప్రూవర్గా మారిన వ్యాపారవేత్త దినేశ్ అరోరా విచారణలో చెప్పాడని ఈడీ పేర్కొన్నది.
తన అరెస్టుకు ముందు సంజయ్ సింగ్ ఒక వీడియో సందేశాన్ని రికార్డు చేశారు. అవినీతికి వ్యతిరేకంగా తన పోరాటం కొనసాగుతుందని అందులో పేర్కొన్నారు. చావనైనా చస్తాను కానీ, తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అదానీ స్కామ్లను తాను బహిర్గతం చేశానని, ఈడీకి ఫిర్యాదులు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో మోదీకి ఓటమి తప్పదని, దాడులు, అరెస్టులు వంటి వాటి ద్వారా విజయం సాధించలేరని స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఈడీ తనను బలవంతంగా అరెస్టు చేస్తున్నదని చెప్పారు.
ఢిల్లీలో, పంజాబ్లో అధికారంలో ఉన్న ఆప్ను కేంద్రంలోని బీజేపీ సర్కార్ లక్ష్యంగా చేసుకొన్నదనే విమర్శలు ఉన్నాయి. ఇందులో భాగంగా ఈడీ తాజాగా అరెస్టు చేసిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్.. ఆ పార్టీ కీలక నేతల్లో మూడో వ్యక్తి కావడం గమనార్హం. అంతకుముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో డిప్యూటీ సీఎంగా ఉన్న మనీశ్ సిసోడియాను కూడా ఇదే ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ అరెస్టు చేసింది. మాజీ మంత్రి సత్యేందర్ జైన్ను ఈడీ ఓ మనీల్యాండరింగ్ కేసులో గత ఏడాది అరెస్టు చేసి జైలుకు పంపింది.
ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ లబ్ధి పొందివుంటే, ఆ పార్టీని మనీలాండరింగ్ కేసులో నిందిత జాబితాలో ఎందుకు చేర్చలేదని సుప్రీంకోర్టు బుధవారం ఈడీని ప్రశ్నించింది. ‘ఒక రాజకీయ పార్టీకి లబ్ధి చేకూరిందని మీ కేసు చెబుతుంది. అయితే ఆ పార్టీని నిందితుడి లేదా ఇంప్లీడెడ్గా ఎందుక చేర్చలేదు’ అని ప్రశ్నించింది.
ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టును ఆప్ ఖండించింది. రాజకీయ ప్రతీకార చర్య అని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. అదానీ అక్రమాలను పార్లమెంట్లో లేవనెత్తినందుకు ఆయన్ను అరెస్టు చేశారని ఆరోపించారు. సంజయ్ సింగ్ అరెస్టు పూర్తిగా అక్రమమని ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికలపై ప్రధాని మోదీ భయపడుతున్నారనే దానికి తాజా అరెస్టు నిదర్శనమని, ఎన్నికలకు ముందు ప్రతిపక్ష గ్రూపు నుంచి మరిన్ని అరెస్టులు కూడా చేసే అవకాశం లేకపోలేదని పేర్కొన్నారు. అంతకుముందు సంజయ్ సింగ్ నివాసంలో ఈడీ సోదాలపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. 2024 లోక్సభ ఎన్నికల్లో ఓటమి తప్పదని బీజేపీ గ్రహించిందని, అందుకే తన చివరి ప్రయత్నంలో భాగంగా ఇది చేస్తున్నదని పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఎన్నోసార్లు సోదాలు చేశారని, ఒక్క పైసా అక్రమ సొమ్ము కూడా రికవరీ చేయలేకపోయారని అన్నారు. తాము నిజాయితీగా లేకపోతే ఈ సమస్యలన్నీ ఉండేవి కాదన్నారు.