న్యూఢిల్లీ, జనవరి 27: కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని మధ్యస్థాయి నుంచి సీనియర్ మేనేజ్మెంట్ ర్యాంకు ఉద్యోగాల్లో దాదాపు 30 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగులకు గత ఆరేండ్లుగా పదోన్నతులు కల్పించకపోవడంతోనే ఈ భారీ అగాథం ఏర్పడింది. దీనికి సంబంధించి కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖకు(డీవోపీటీ).. సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ (సీఎస్ఎస్) ఫోరమ్ ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ ఫలితం ఉండటంలేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తగినంత మంది అధికారులను రాష్ర్టాలు పంపించకపోవడంతోనే అఖిల భారత సర్వీసుల్లో (ఏఐఎస్) అధికారుల కొరత వేధిస్తున్నదని ఆరోపిస్తూ క్యాడర్ రూల్స్కు సవరణలు ప్రతిపాదించిన కేంద్రం.. మంత్రిత్వశాఖల్లోని ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడంలో మీనమేషాలు లెక్కిస్తుండటంపై ఉద్యోగుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జాప్యానికి కారణమేంటి?
‘కేంద్రప్రభుత్వంలోని పలు విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఏటా పదోన్నతులు లభిస్తున్నాయి. అయితే మంత్రిత్వ శాఖల్లో పనిచేస్తున్న సీఎస్ఎస్ అధికారుల పదోన్నతులను పర్యవేక్షించే క్యాడర్ కంట్రోలింగ్ అథారిటీ డీవోపీటీ మాత్రం గత ఆరేండ్లుగా పదోన్నతులపై ఆదేశాలు ఇవ్వడంలేద’ని సీఎస్ఎస్ ఫోరమ్ ప్రధాన కార్యదర్శి మన్మోహన్ వర్మ ఆరోపించారు. పదోన్నతుల్లో జాప్యానికి కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసులే కారణమని డీవోపీటీ చెబుతున్నట్టు వెల్లడించారు. పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు చూడాల్సిన అవసరంలేదంటూ (కొన్ని పరిస్థితులను మినహాయిస్తే) జర్నైల్ సింగ్ వర్సెస్ కేంద్రప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు 2018 జూన్లో ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ అన్ని శాఖలకు డీవోపీటీ సూచనలు పంపించిందని, అయితే పదోన్నతులు మాత్రం చేపట్టలేదని వాపోయారు. శాఖల్లో పనిభారం పెరుగుతుండటంతో 2020 నుంచి 2,770 మంది అధికారులను డీవోపీటీ రిక్రూట్ చేసిందని.. అయితే ఖాళీగా ఉన్న 1,839 పోస్టులను మాత్రం పదోన్నతులతో భర్తీ చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పదోన్నతులు ఆగడంతో నష్టమేంటి?
గత ఆరేండ్లుగా పదోన్నతులు నిలిపివేయడంతో ఈ కాలంలో రిటైరైన ఉద్యోగులు ఎక్కువ వేతనం వంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందుకోలేదని, అలాగే పెన్షన్ లాభాలు కూడా కోల్పోయారని సీఎస్ఎస్లో భాగమైన ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. 30 శాతం వరకు పోస్టులు ఖాళీగా ఉండటంతో మిగతా ఉద్యోగుల పైనే పనిభారం ఎక్కువగా పడుతున్నదని వాపోతున్నారు.
ఎన్నిపోస్టులు ఖాళీగా ఉన్నాయి?
ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ అయిన సీఎస్ఎస్ ఫోరమ్ అంచనా ప్రకారం.. మంత్రిత్వ శాఖల్లో మొత్తం 6,210 పోస్టులు ఉండగా, 1,839 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఏయే ర్యాంకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి?
సెక్షన్ ఆఫీసర్, అండర్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, డైరెక్టర్, జాయింట్ సెక్రటరీ