కొలంబో, మే 6: శ్రీలంకలో మళ్లీ ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు అధ్యక్షుడు గొటబయ రాజపక్స ప్రకటించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఎమర్జెన్సీ అమల్లోకి వస్తుందని వెల్లడించారు. శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. శాంతి భద్రతలను కాపాడేందుకు, ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు వీలుగా ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు అధ్యక్షుడు ప్రకటించారు.
ఎమర్జెన్సీ సమయంలో పోలీసులు, భద్రతా బలగాలకు అపరిమిత అధికారాలు లభిస్తాయి. నిరసనకారులను ఎవరినైనా ఎలాంటి కారణాలు చూపకుండానే అరెస్టు చేయొచ్చు. కాగా, పార్లమెంటుకు వెళ్లే దారిని ఇంటర్ యూనివర్సిటీ స్టూడెంట్ ఫెడరేషన్కు చెందిన విద్యార్థినేతలు దిగ్బంధించారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న మే 17లోగా గొటబయ పదవికి రాజీనామా చేయాలని అల్టిమేటం జారీచేశారు. లేదంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.