ఐదు నెలల్లో నాలుగోసారి ప్రజలపై భారం
గుజరాత్ రాష్ట్ర మాడల్ పూర్తిగా ఫెయిల్.. అంటూ క్రిశాంక్ ట్వీట్
రీట్వీట్ చేసిన ఐటీశాఖ మంత్రి కేటీఆర్
హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ) : అభివృద్ధిలో ముందున్నామంటూ గొప్పలు చెప్పుకొనే బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం గడచిన ఐదునెలల్లో నాలుగుసార్లు ప్రజలపై విద్యుత్తు చార్జీల భారం మోపింది. తాజా పెంపుతో ఫ్యూయల్ సర్చార్జి యూనిట్కు రూ.2.5కు చేరింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు యూనిట్ ధర 40 పైసలు పెరుగగా.. గత సంవత్సర కాలంలో యూనిట్పై 70పైసల అదనపు భారం వినియోగదారులపై పడింది. ఈ మేరకు గుజరాత్లో విద్యుత్తు చార్జీల పెంపుపై వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలను టీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. గుజరాత్ మాడల్ ఫెయిల్ అయ్యిందంటూ పేర్కొన్నారు. ఈ కథనాలను మంత్రి కేటీఆర్ ఆదివారం రీట్వీట్ చేశారు.
ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ ప్రైస్ అడ్జస్ట్మెంట్(ఎఫ్పీపీపీఏ) చార్జీలు, ఫ్యూయల్ సర్చార్జ్ పేరుతో పెంచిన చార్జీలు మే ఒకటినుంచి అమల్లోకి వస్తాయని రాష్ట్రప్రభుత్వ ఆధీనంలోని విద్యుత్తు పంపిణీ సంస్థ గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్(జీయువీఎన్ఎల్) ప్రకటించింది. ఇంధన చార్జీల పెరుగుదలతో ఏర్పడిన లోటును మే, జూన్ మాసాల్లో వినియోగదారుల విద్యుత్ చార్జీలనుంచి సర్దుబాటు చేసుకుంటామని తెలిపింది. ప్రస్తుతం ఎఫ్పీపీపీఏ చార్జీలు యూనిట్కు రూ.1.8 చెల్లిస్తుండగా, తాజా పెంపుతో ఈ నెలనుంచి అది రూ. 2.5కు చేరనున్నది. అంటే యూనిట్కు 70పైసలు అదనంగా వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే గడిచిన నాలుగు నెలల్లో గుజరాత్ ప్రభుత్వం ఫ్యూయల్ సర్చార్జ్ని 20పైసల నుంచి నాలుగు దఫాల్లో రూ2.50కు పెంచడం గమనార్హం. వ్యవసాయానికి మినహా మిగిలిన అన్ని శ్రేణుల కనెక్షన్లకూ ఈ పెంపు వర్తిస్తున్నది.
తెలంగాణతో పోలికా..?
ఫ్యూయల్ చార్జీల పెంపుతో గడచిన రెండు నెలల్లో ప్రతి యూనిట్కు ఎఫ్పీపీపీఏ 30పైసలకు పెరిగిందని, దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతినెలా రూ. 270కోట్లు, సంవత్సరానికి రూ. 3240కోట్ల భారం పడుతుందని గుజరాత్ విద్యుత్తు రెగ్యులేటరీ నిపుణులు కేకే బజాజ్ పేర్కొన్నారు. మరోవైపు, గుజరాత్ అందరికీ ఆదర్శమని గొప్పలు చెప్పుకొనే బీజేపీ.. ప్రజలపై పదేపదే విద్యుత్ ఛార్జీల భారం మోపడంపై తెలంగాణవాదులు విమర్శలు గుప్పిస్తున్నారు. గుజరాత్ మాడల్ విఫలమైందంటూ సోషల్ మీడియా వేదికగా వారు పోస్టులు పెడుతున్నా రు. తెలంగాణ ప్రభుత్వం ముందుచూపుతో చేసుకున్న విద్యుత్తు ఒప్పందాల ఫలితంగా ప్రజలపై పెద్దగా భారం మోపకుండానే నిరంతరం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తుండటాన్ని వారు గుర్తుచేస్తున్నారు.