న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు అకస్మాత్తుగా పెరిగాయి. ఢిల్లీ ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎన్జీ, హైబ్రిడ్ ఇంధన వాహనాల కన్నా ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ ప్రభుత్వ రవాణా శాఖలో గత జూలై నుంచి సెప్టెంబర్ మధ్య ఏడు శాతం మేర ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. ఇక సీఎన్జీ వాహనాలు కేవలం ఆరు శాతం మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. ఈ సమయంలో 1.5 లక్షల వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. దాంట్లో 7869 ఎలక్ట్రిక్ వాహనాలు, 6857 సీఎన్జీ వాహనాలు, సీఎన్జీ-పెట్రోల్తో నడిచే 7257 వాహనాలు ఉన్నట్లు చెప్పారు. కేవలం పెట్రోల్, డీజిల్పై నడిచే వాహనాలు 93,091 రిజిస్టర్ అయినట్లు అధికారులు తెలిపారు. ఎలక్ట్రిక్ వెహికిల్ విధానం క్రమం పుంజుకుంటోందని, ఆ వాహనాల కోనుగోలు పెరిగిందని, ఢిల్లీని ఎలక్ట్రిక్ వెహికల్ క్యాపిటల్గా మార్చాలన్న తమ లక్ష్యం నెరవేరనున్నదని రశాణాశాఖ మంత్రి కైలాశ్ గహ్లోత్ తెలిపారు. ఎలక్ట్రిక్ రిక్షాలు, టూ వీలర్లతో పాటు ఎలక్ట్రిక్ కార్లు, బస్సుల కొనుగోళ్లు కూడా పెరిగినట్లు రవాణశాఖ అధికారులు అంటున్నారు.