హైదరాబాద్, జనవరి 18: మూడు ఈశాన్య రాష్ర్టాల్లో ఎన్నికలకు నగారా మోగింది. త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్లో వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ర్టాలు చిన్నవే అయినా ఇక్కడ వచ్చే ఫలితాలు మాత్రం ఆ తర్వాత జరగబోయే ఏడు అసెంబ్లీల ఎన్నికలు, వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపనున్నాయి. ఈ మూడు రాష్ర్టాల్లో బీజేపీ భాగంగా ఉన్న కూటములే అధికారంలో ఉండటం వల్ల ఆ పార్టీకి ఈ ఎన్నికలు సవాల్గా మారాయి. ఇటీవలే హిమాచల్లో అధికారాన్ని కోల్పోయిన బీజేపీ ఈ మూడు రాష్ర్టాల్లోనూ ప్రతికూల ప్రతిస్థితులనే ఎదుర్కొంటున్నది. మరోవైపు ప్రాంతీయ పార్టీలు సత్తా చాటుకునేందుకు ఈ మూడు రాష్ర్టాల ఎన్నికలు ఒక అవకాశంగా కనిపిస్తున్నాయి.
త్రిపురలో చతుర్ముఖ పోరు
త్రిపురలో గత ఎన్నికల్లో మేజిక్ ఫిగర్ను సాధించి అధికారంలోకి వచ్చింది బీజేపీ. స్థానిక గిరిజనుల పార్టీగా గుర్తింపు పొందిన ఐపీఎఫ్టీతో పొత్తు అప్పుడు బీజేపీకి కలిసొచ్చింది. అయితే, ఇప్పుడు పరిస్థితులు మారాయి. బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో అంతర్గత విభేదాలు ఉన్నాయి. ఐపీఎఫ్టీతోనూ బీజేపీ సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. 2018లో విప్లవ్ దేవ్ను సీఎంగా ఎంపిక చేసిన బీజేపీ ఆయన పనితీరు బాగాలేదని కొంతకాలానికి దింపేసి మాణిక్ సాహాను సీఎం పీఠంపై కూర్చొబెట్టింది. ఆయనను కూడా కొందరు బీజేపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు సుదీర్ఘకాలం త్రిపురలో అధికారంలో ఉండి గత ఎన్నికల్లో ఓడిన సీపీఎం.. కాంగ్రెస్తో కలుస్తున్నది. గతంలో కాంగ్రెస్ కీలక నాయకురాలిగా పని చేసిన సుష్మిత దేవ్ ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్లో కీలకంగా మారారు.
మేఘాలయ బీజేపీ కూటమికి బీటలు
గత ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో ఎన్పీపీ మేఘాలయలో అధికారంలోకి వచ్చింది. అయితే, ఇప్పుడు రెండు పార్టీల మధ్య పొత్తుకు బీటలు వారుతున్నాయి. తమ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ఎన్పీపీ నేత, సీఎం కన్రాడ్ సంగ్మా ప్రకటించారు. గత ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచినా అధికారం దక్కించుకోలేని కాంగ్రెస్ ఇప్పుడు మరింత కష్టాల్లో ఉంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తృణమూల్ మరింత పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్నది.
నాగాలాండ్లో బలంగా స్థానిక పార్టీలు
నాగాలాండ్లో ప్రస్తుతం ఎన్డీపీపీ, బీజేపీ, ఎన్పీఎఫ్ పార్టీలతో కూడిన యునైటెడ్ డెమొక్రటిక్ అలయెన్స్ అధికారంలో ఉంది. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదు. గత ఎన్నికల్లో 12 స్థానాలు గెలిచిన బీజేపీ ఇప్పుడు 20 స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నది. మరోవైపు ఏడు గిరిజన తెగలకు చెందిన ప్రజలు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది బీజేపీపై ప్రభావం చూపవచ్చు.