న్యూఢిల్లీ/ముంబై: శివసేన పేరు, గుర్తును ఏక్నాథ్ షిండే వర్గానికి ఇచ్చిన ఎన్నికల సంఘంపై మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసీని రద్దు చేయాలని డిమాండ్ చేసిన ఆయన.. ఈసీ సభ్యులను కూడా ప్రజలే ఎన్నుకోవాలన్నారు. శివసేన సస్పెండ్ చేసిన ఎమ్మెల్యేల వ్యవహారం సుప్రీంలో పెండింగ్లో ఉన్నందున పార్టీ పేరు, గుర్తు కేటాయింపుపై ఇప్పుడే నిర్ణయం తీసుకోవద్దని తాము అభ్యర్థించినా ఈసీ పట్టించుకోలేదని విమర్శించారు. అంత త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. కాగా, ఈసీ నిర్ణయంపై ఉద్ధవ్ వర్గం సుప్రీంను ఆశ్రయించింది.
పల్లీలు కొన్నట్టు పార్టీ పేరు కొన్నారు
శివసేన పార్టీ పేరు, గుర్తును పల్లీలు కొన్నట్టు కొన్నారనేది రహస్యం ఏమీ కాదని శివసేన(యూబీటీ) అధికారిక పత్రిక ‘సామ్నా’ ఎడిటోరియల్లో పేర్కొంది. ఢిల్లీ బూట్లు నాకుతున్న వారికి శివసేన పేరు, గుర్తును కట్టబెట్టారని పేర్కొంది. అమిత్ షా వల్లనే ఇది జరిగిందని వ్యాఖ్యానించింది.