Election Commission | లోక్సభతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ చెప్పారు. శనివారం ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్లో మీడియాతో మాట్లాడారు. ఒడిశాలోని 50 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ వసతి కల్పనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రజాస్వామ్య పండుగలో ఓటర్లంతా భాగస్వాములు కావాలని రాజీవ్ కుమార్ పిలుపునిచ్చారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు నిష్పక్షపాతంతో, పారదర్శకంగా విధులు నిర్వహించడంతోపాటు అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో నగదు ప్రభావం, హింసకు తావు లేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాటు చేయాలని చెప్పారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈవీఎంలకు పక్కాగా సీల్ వేసి.. స్ట్రాంగ్ రూమ్లకు తరలించి మూడంచెల భద్రత కల్పించాలని ఆదేశించారు.