న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఆరు అసెంబ్లీ స్థానాలతోపాటు లక్షద్వీప్ లోక్సభకు ఫిబ్రవరి 27న ఉపఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 18న షెడ్యూల్ విడుదల చేసింది. అయితే లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్ దోషిత్వాన్ని, అతనికి విధించిన శిక్షను సస్పెండ్ చేస్తూ కేరళ హైకోర్టు ఈ నెల 25న ఆర్డర్ పాస్ చేసింది. దాంతో లక్షద్వీప్ ఉపఎన్నికను నిలిపివేస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఈ మేరకు ఇవాళ ఒక ప్రకటన చేసింది.
లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్ ఓ కేసులో దోషిగా తేలడంతో అతనికి జైలుశిక్ష పడింది. దాంతో భారత రాజ్యంగ నిబంధనల ప్రకారం అతని లోక్సభ సభ్యత్వం రద్దయ్యింది. కాబట్టి ఇతర రాష్ట్రాల్లో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలతోపాటు లక్షద్వీప్ పార్లమెంట్ స్థానానికి కూడా ఉపఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ పేర్కొంది. ఈ ఎన్నికల ఫలితాలను మార్చి 2న వెల్లడించనున్నట్లు తెలిపింది.
అయితే, లక్షద్వీప్ ఉపఎన్నిక ఆగిపోయినప్పటికీ.. కేంద్ర ఎన్నికల సంఘం ముందుగా షెడ్యూల్లో పేర్కొన్నట్టుగానే వివిధ రాష్ట్రాల్లో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు యథావిధిగా జరగనున్నాయి. ఉపఎన్నికలు జరిగే అసెంబ్లీ స్థానాలు మహారాష్ట్రలో రెండు, అరుణాచల్ప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి.