న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి అభ్యర్థనను కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు అంగీకరించింది. బెంగాల్లో మమతాబెనర్జి బరిలో దిగాలని భావిస్తున్న భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి సెప్టెంబర్ 30న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా బెంగాల్లోని షంషేర్గంజ్, జాంగీర్పూర్ అసెంబ్లీ స్థానాలకు, ఒడిశాలోని పిప్లీ అసెంబ్లీ స్థానానికి కూడా సెప్టెంబర్ 30న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు తెలిపింది.
ఈ ఉపఎన్నికల్లో పోలైన ఓట్లను అక్టోబర్ 3న లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలకు సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలంటూ బెంగాల్కు చెందిన అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గత జూలైలో ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో బెంగాల్లో బై ఎలక్షన్లకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసింది.
వాస్తవానికి మొత్తం 13 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగాల్సి ఉండగా.. ఆంధ్రప్రదేశ్, అసోం, బీహార్, హర్యానా, హిమాచల్ప్రదేశ్, మధ్యప్రదేశ్, మేఘాలయా, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు కరోనా మహమ్మారి ప్రభావం, పండుగల నేపథ్యంలో ఉపఎన్నికల నిర్వహణపై విముఖత వ్యక్తం చేస్తూ ఈసీకి లేఖలు రాశారు. పండుగల సీజన్ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని సలహా ఇచ్చారు. అదే సమయంలో పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాలు మాత్రం తమ రాష్ట్రాల్లో మహమ్మారి కంట్రోల్లో ఉన్నదని, ఎన్నికలకు తాము సిద్ధమేనని తెలిపాయి.
ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ఉప ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించింది. తెలంగాణలో ఖాళీగా ఉన్న హుజూరాబాద్ సహా ఇతర రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు పండుగల సీజన్ తర్వాతే ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నది.