ఎన్నికలకు అడ్డుపడుతున్నరు
కర్ణాటక సర్కారుపై హైకోర్టుకు రాష్ట్ర ఎన్నికల సంఘం
బెంగళూరు, మే 17: కర్ణాటక ప్రభుత్వం తమ అధికారాలను లాగేసుకొన్నదని రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. జిల్లా పంచాయతీ, తాలూకా పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం అడ్డుపడుతున్నదని ఆరోపించింది. డీలిమిటేషన్, రిజర్వేషన్ జాబితా రూపకల్పనపై ఎన్నికల సంఘానికే అధికారం ఉన్నప్పటికీ కర్ణాటక సర్కారు వేరే ప్యానల్ను నియమించిందని పేర్కొన్నది.
డీలిమిటేషన్ పూర్తి కాకుండా, రిజర్వేషన్ను అనుగుణంగా పంచాయతీల జాబితా సిద్ధం చేయకుండా ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించలేమని తెలిపింది. కర్ణాటకలో జిల్లా, తాలూకా పంచాయతీల ఎన్నికలను వెంటనే నిర్వహించాలని గతవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే, ప్రభుత్వం అడ్డుపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కర్ణాటక హైకోర్టుకు వెళ్లింది. ఈ అంశంపై అత్యవసరంగా విచారణ నిర్వహించాలని కోరింది. పిటిషన్పై మంగళవారం విచారించిన కోర్టు అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నది. విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.