న్యూఢిల్లీ, మే 24: సార్వత్రిక ఎన్నికల ఆరో దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. శనివారం ఆరు రాష్ర్టాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. 5.84 కోట్ల మంది పురుషులు, 5.29 కోట్ల మంది మహిళలు, 5,120 మంది థర్డ్ జెండర్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 889 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఢిల్లీలోని ఏడు, హర్యానాలోని మొత్తం 10 స్థానాలకు ఇదే విడతలో ఎన్నికలు పూర్తి కానున్నాయి.
ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్సభ స్థానాలకు ఈ విడతలోనే పోలింగ్ జరగనుంది. 1.52 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గత రెండు ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ క్లీన్స్వీప్ చేయగా ఈసారి ఆప్ – కాంగ్రెస్ కలిసికట్టుగా బీజేపీని ఎదుర్కొంటున్నాయి. నాలుగు స్థానాల్లో ఆప్, మూడు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సహా ఆప్ నేతల అరెస్టు ప్రభావం ఈ ఎన్నికలపై పడొచ్చు. బీజేపీ తరపున సుష్మా స్వరాజ్ కూతురు బన్సూరి స్వరాజ్, కాంగ్రెస్ తరపున జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ తదితరులు పోటీలో ఉన్నారు.
తృణమూల్ కాంగ్రెస్ – బీజేపీ మధ్య తీవ్రస్థాయిలో పోటీ ఉన్న పశ్చిమ బెంగాల్లో.. గిరిజన ప్రాంతమైన జంగల్ మహాల్లోని ఎనిమిది స్థానాలకు పోలింగ్ జరగనుంది. 1.45 కోట్ల మంది ఓటర్లు 79 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
బీజేపీకి, ఇండియా కూటమికి కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లోని పూర్వాంచల్ ప్రాంతంలో ఉన్న 14 నియోజకవర్గాలకు ఆరో విడతలో పోలింగ్ జరగనుంది. 162 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బీజేపీకి సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తుండగా, బీఎస్పీ పొందే ఓట్లు గెలుపోటములను నిర్ణయించే అవకాశం ఉంది.
బీజేపీ పాలిత రాష్ట్రమైన హర్యానాలోని 10 లోక్సభ స్థానాలకు ఈ దశలో ఎన్నికలు జరగనున్నాయి. 223 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీ తరపున కేంద్రమంత్రులు రావ్ ఇందర్జిత్ సింగ్, కిషన్ పాల్ గుర్జార్, మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కాంగ్రెస్ సీనియర్ నేతలు కుమారి శెల్జా, దీపేందర్ సింగ్ హూడా, తదితరులు ఎన్నికల బరిలో నిలిచారు.
జార్ఖండ్లోని గిరిదిహ్, ధన్బాద్, రాంచి, జంషేద్పూర్ స్థానాలకు ఆరో విడతలో ఎన్నికలు జరగనుండగా 93 మంది పోటీలో ఉన్నారు. 82.16 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బీజేపీ, కాంగ్రెస్ – జేఎంఎంతో కూడిన ఇండియా కూటమి మధ్య ఇక్కడ పోటీ ఉంది.
బిహార్లో ఎనిమిది లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అన్ని స్థానాల్లోనూ ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య ద్విముఖ పోటీ నెలకొన్నది. మొత్తం 1.49 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.
బిజూ జనతాదళ్(బీజేడీ), బీజేపీ మధ్య తీవ్ర పోటీ ఉన్న ఒడిశాలో ఆరో దశలో ఆరు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ కూడా బరిలో ఉన్నప్పటికీ మెజారిటీ స్థానాల్లో ప్రధానంగా బీజేడీ, బీజేపీ అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నెలకొన్నది. లోక్సభ స్థానాలతో పాటు 42 అసెంబ్లీ స్థానాలకు సైతం ఎన్నికలు జరగనున్నాయి.
– జమ్ము కశ్మీర్లోని అనంత్నాగ్ – రాజౌరీ స్థానానికి మూడో విడతలో ఎన్నిక జరగాల్సి ఉన్నా వాతావరణ ప్రతికూలతల వల్ల ఆరో దశలో జరుగుతున్నది. ఇక్కడ పీడీపీ నుంచి మాజీ సీఎం మహబూబా ముఫ్తీ బరిలో ఉన్నారు.