న్యూఢిల్లీ, అక్టోబర్ 8: శివసేన పార్టీ గుర్తు విషయంలో మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే, సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని వర్గాలకు ఎన్నికల సంఘం (ఈసీ) షాక్ ఇచ్చింది. తూర్పు అంధేరి అసెంబ్లీ ఉప ఎన్నికలో ఆ రెండు వర్గాలు శివసేన పార్టీ పేరు, విల్లు-బాణం గుర్తును వాడుకోకుండా స్తంభింపజేసింది. రెండు వర్గాలు సోమవారం వరకు మూడు పేర్లు, గుర్తులను సూచించాలని ఆదేశించింది. వాటి నుంచే పేరు, చిహ్నాన్ని ఎంపిక చేసి, రెండు వర్గాలకు ఈసీ కేటాయించనుంది. అంధేరి తూర్పు అసెంబ్లీ ఉప ఎన్నిక సమీపిస్తున్న తరుణంలో శివసేన పార్టీ గుర్తును తమకు కేటాయించాలని షిండే వర్గం ఈసీని కోరింది. అయితే శివసేన గుర్తు అడిగే హక్కు షిండే వర్గానికి లేదని, పార్టీ నుంచి బయటకు వెళ్లినవారికి గుర్తు అడిగే హక్కు లేని ఉద్ధవ్ వర్గం స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలూ పార్టీ గుర్తును వాడకుండా ఈసీ తాత్కాలికంగా స్తంభింపజేసింది.