Maharashtra | ముంబై, జూలై 7: మహారాష్ట్రలోని ట్రిపుల్ ఇంజిన్ సర్కార్లో ముసలం మొదలైంది. రాష్ట్ర క్యాబినెట్లో ఎన్సీపీ నేతల చేరిక… ఇటు బీజేపీ, అటు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నాయకులను కలవరానికి గురిచేస్తున్నది. అజిత్ వర్గం చేరికను ఇరుపార్టీల నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అజిత్ వర్గానికి ముఖ్య శాఖలు కేటాయిస్తే తమ పరిస్థితి ఏంటని వారు కలవరపాటుకు గురవుతున్నారు. శివసేనను చీల్చి ప్రభుత్వంలో చేరిన తమ ఉద్దేశం నెరవేరదని వారు లోలోన భయపడుతున్నారు. ఈ మేరకు తమ అధినేత ఏక్నాథ్ షిండే వద్ద ఆ వర్గం నేతలు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఇలాగైతే రానున్న ఎన్నికల్లో తమ వర్గానికి ఓట్లు పడవని, ఒక్క సీటు కూడా గెలవలేమని వారు షిండేకు వివరించారు. దీంతో హుటాహుటిన ఆయన బీజేపీ నేత, ఉపముఖ్యమంత్రి ఫడ్నవీస్తో గురువారం అర్ధరాత్రి భేటీ అయ్యారు. పార్టీలో నేతల అసంతృప్తిపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తున్నది. ఈ భేటీ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. క్యాబినెట్లో ఎన్సీపీ నేతల చేరికతో తన వర్గంలోని ఎమ్మెల్యేలు అసంతృప్తితో లేరని, తానే 2024 వరకు సీఎంగా ఉంటానని ఏక్నాథ్ షిండే వ్యాఖ్యానించిన మరుసటి రోజే ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
ఇతర పార్టీలను నాశనం చేసి అయినా తమ పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదని షిండే వర్గానికి మద్దతు తెలిపిన స్వతంత్య్ర ఎమ్మెల్యే బచ్చు ఖాడు తెలిపారు. బీజేపీకి ఎంపీ సీట్లే ముఖ్యమని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచేందుకే బీజేపీ ఇలాంటి పన్నాగాలు పన్నుతున్నదని ఆయన విమర్శించారు. ‘శివసేన పార్టీ చీలికకు సహకరించిన 39 మంది ఎమ్మెల్యేలు తప్పు చేశామని ఇప్పుడు బాధపడుతున్నారు. అజిత్ వర్గం రాకతో కొత్త సమస్యలు వస్తాయని వారు భయపడుతున్నారు. ఎన్సీపీ మంత్రి అతిథి తట్కరేను రాయగఢ జిల్లా ఇన్చార్జి మంత్రిగా నియమిస్తే సహించబోమని షిండే వర్గంలోని ఎమ్మెల్యేలు భారత్ గోగావలే, మహేంద్ర తోర్వే హెచ్చరించడమే అసంతృప్తికి నిదర్శనం. గతంలోనూ మహావికాస్ అఘాడీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అజిత్ తమకు నిధుల విషయంలో అన్యాయం చేశారు’ అని ఖాడు తెలిపారు.
అర్ధరాత్రి జరిగిన భేటీపై శరద్ పవార్ వర్గం స్పందించింది. షిండే వర్గంలో అశాంతి, అలజడి మొదలైందని అనేందుకు ఈ భేటీ రుజువని ఆ వర్గం పేర్కొంది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ అధికార ప్రతినిధి మహేశ్ తాపసే దీనిపై మాట్లాడుతూ… రానున్న ఎన్నికలను ఎలా ఎదుర్కొవాలో తెలియక షిండే వర్గం ఎమ్మెల్యేలు మథనపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అజిత్ వర్గం చేరికతో తమకు మంత్రి పదవి దక్కుతుందో లేదోనని వారు లోలోన భయపడుతున్నారని తెలిపారు. కాగా, శుక్రవారం ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన శరద్పవార్ తన నివాసంలో పార్టీ నేతలను కలిశారు. శనివారం ఆయన నాసిక్ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. మరోవైపు తమ పార్టీ 71 సీట్లను గెలుస్తుందని, 90 సీట్లలో పోటీ చేస్తామని అజిత్ పవార్ వ్యాఖ్యానించారు.
మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలపై చాలామంది బీజేపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పంకజ ముండే తెలిపారు. ‘బీజేపీకి రాష్ట్రంలో 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో చాలా మంది ప్రస్తుత పరిణామాలపై అసంతృప్తితో ఉన్నారు. బయటికొచ్చి మాట్లాడేందుకు భయపడుతున్నారు. నా సిద్ధాంతాల విషయంలో రాజీ పడాల్సి వచ్చింది. అందుకే రెండు నెలల పాటు సెలవులు తీసుకొని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలనుకుంటున్నా’ అని ఆమె తెలిపారు. పంకజ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ స్పందించారు. ‘జరుగుతున్న పరిణామాలపై పార్టీలో కొంతమంది అసంతృప్తిగా ఉన్నారనేది వాస్తవమే. పార్టీ కార్యకర్తలు, నేతలు చాలా కాలం నుంచి ఎన్సీపీపై పోరాడుతున్నారు. ఎన్సీపీతో పొత్తును పార్టీ నేతలు ఇప్పటికిప్పుడు అంగీకరించకపోవచ్చు’ అని ఆయన పేర్కొన్నారు.