ముంబై, జూన్ 30: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. బీజేపీ, శివసేన రెబెల్ ఎమ్మెల్యేలతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే ద్రోహానికి ఫలితం దక్కింది. అనూహ్యంగా ఆయనను సీఎం పదవి వరించింది. శివసేనలో మొదలైన తిరుగుబాటుతో పది రోజులుగా మహారాష్ట్రలో రాజకీయాలు అనేక మలుపులు తీసుకొన్నాయి. ఎన్ని మలుపులు తీసుకొన్నప్పటికీ రెబెల్స్ మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ఫడ్నవీస్ సీఎం అవుతారని అంతా భావించారు. ఏక్నాథ్ షిండేకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారనుకొన్నారు. కానీ ైక్లెమాక్స్లో మహా ట్విస్ట్ జరిగింది. ఎవ్వరూ ఊహించని విధంగా ఏక్నాథ్ షిండే సీఎం అయ్యారు.
గురువారం సాయంత్రం 7.30 గంటలకు గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ సీఎంగా ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్తో ప్రమాణం చేయించారు. అనంతరం సీఎం ఏక్నాథ్ షిండే తొలి క్యాబినెట్ భేటీ నిర్వహించారు. శనివారం, ఆదివారం అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చాలని నిర్ణయించారు. షిండే తన మెజారిటీని నిరూపించుకోవడానికి గవర్నర్ శనివారం వరకు గడువునిచ్చారు. ఇదిలా ఉండగా, ఏక్నాథ్ షిండే, ఫడ్నవీస్లకు ఉద్ధవ్ ఠాక్రే శుభాకాంక్షలు తెలిపారు. షిండే పాలనలో మహారాష్ట్రకు మంచి జరుగుతుందని ఆకాంక్షిస్తున్నట్టు ఆయన ట్వీట్ చేశారు.
అన్ని వర్గాలను కలుపుకొని పోతా
బాల్ ఠాక్రే, ఆనంద్ దిఘేలకు నివాళులర్పించిన తర్వాత ఏక్నాథ్ షిండే సీఎంగా ప్రమాణం చేశారు. ‘రాష్ట్ర అభివృద్ధికే నా ప్రాధాన్యం. అన్ని వర్గాలను కలుపుకొని పోతాను’ అని ప్రమాణ స్వీకారం అనంతరం షిండే అన్నారు. ఏక్నాథ్ షిండే, ఫడ్నవీస్లను ప్రధాని మోదీ అభినందించారు. షిండే ప్రజా నాయకుడని కొనియాడారు. ఆయన నాయకత్వంతో మహారాష్ట్ర అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. ఏక్నాథ్ను సీఎంగా ప్రకటించగానే రెబెల్ ఎమ్మెల్యేలు డ్యాన్సులు చేస్తూ సంబురాలు జరుపుకొన్నారు.
నాటకీయ పరిణామాలు
బుధవారం ఉద్ధవ్ ఠాక్రే రాజీనామాతో బీజేపీ, రెబల్స్ సంకీర్ణ ప్రభుత్వం ఖరారు అయింది. అయితే, గురువారం ఏక్నాథ్ షిండే ఎంపిక కూడా అత్యంత నాటకీయ పరిస్థితుల మధ్య జరిగింది. మహారాష్ట్ర కొత్త సీఎం షిండే అని దేవేంద్ర ఫడ్నవీస్ గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ప్రకటించారు. తాను ప్రభుత్వంలో భాగస్వామిని కాబోనని, బయటి నుంచి మద్దతు ఇస్తామని తెలిపారు. అయితే, కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఫడ్నవీస్ ప్రకటనకు భిన్నంగా బీజేపీ జాతీయ కార్యదర్శి జేపీ నడ్డా..‘మహారాష్ట్ర కొత్త క్యాబినెట్లో ఫడ్నవీస్ ఉంటారు’ అని ట్వీట్ చేశారు. మూడు గంటల తర్వాత ఫడ్నవీస్ సాయంత్రం 7.30 గంటల సమయంలో డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. ఫడ్నవీస్ను డిప్యూటీ సీఎంగా ఉండటానికి నడ్డానే ఒప్పించారు.
ఈడీ సర్కారు: కాంగ్రెస్
మహారాష్ట్రలో ఈడీ సర్కార్ కొలువుదీరిందని కాంగ్రెస్ విమర్శించింది. ఏక్నాథ్ షిండే పేరులో మొదటి అక్షరం ఈ. దేవేంద్ర ఫడ్నవీస్లో మొదటి అక్షరం డీని కలిపి ఇలా అభివర్ణించింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీతో దాడులు చేయించి ఎంవీఏ కూటమి ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చేసిందని ఆరోపించింది. మహారాష్ట్రలో ఈడీ సర్కారుకు స్వాగతం’ అని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ట్వీట్ చేశారు.
ఆటో డ్రైవర్ నుంచి సీఎం దాకా..!
శివసేనలో తిరుగుబావుటా ఎగురవేసి సీఎం పీఠం చేజిక్కించుకున్న ఏక్నాథ్షిండే.. చిన్నతనంలో ఠాణెలో బీర్ల కంపెనీలో పనిచేశారు. తర్వాత ఆటో డ్రైవర్గా మారారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి శివసేనలో ఠాక్రేల తర్వాత అత్యంత శక్తిమంతమైన నేతగా ఎదిగారు. షిండే కుటుంబం స్వస్థలం సతారా జిల్లా. ఆయన చిన్నతనంలో తల్లిదండ్రులు ఠాణెకు మారారు. ఠాణెలో కుటుంబ అవసరాల కోసం షిండే కూలీ పనులు చేశారు. 1980ల్లో శివసేనలో చేరారు. ఠాణె జిల్లా శివసేన అధ్యక్షుడు ఆనంద్ దిఘేకు దగ్గరయ్యారు. 1997లో ఠాణె మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిచారు. 2001లో దిఘే మరణంతో ఠాణెలో ఏర్పడిన లోటును షిండే పూడ్చారు. కోప్రీ-పాచ్పాఖాడీ నుంచి 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అక్కడి నుంచి వరుసగా నాలుగుసార్లు విజయం సాధించారు. బాల్ ఠాక్రేకు విశ్వాస పాత్రుడిగా మారారు. తిరుగుబాటు ముందు వరకు మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేన శాసనసభ పక్ష నేతగా ఉన్నారు. పార్టీ కార్యకర్తలకు, నేతలకు ఎప్పుడూ అందుబాటులో ఉండటంతో పార్టీపై ఆయన పట్టు పెరిగింది. ప్రస్తుతం షిండే వయసు 58 ఏండ్లు.
వారంతా ఏదో రోజున చింతిస్తారు: రౌత్
ముంబై: శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు ఏదొక రోజున తాము తీసుకున్న నిర్ణయానికి కచ్చితంగా చింతిస్తారని ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. వారి దారి వారు చూసుకున్నారని, అసమ్మతి నేతలు బీజేపీతో స్వేచ్ఛగా జతకట్టుకోవచ్చని, దీనికి ఎటువంటి అడ్డంకులు సృష్టించమని పేర్కొన్నారు. రౌత్ గురువారం మీడియాతో మాట్లాడుతూ రాబోవు రోజుల్లో శివసేన నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని చెప్పారు. బీజేపీపై పరోక్షంగా మాట్లాడుతూ శివసేనలో తిరుగుబాటు రేపాలని ఎమ్మెల్యేలపై ఒత్తిడి చేసిందెవరో తమకు తెలుసని వ్యాఖ్యానించారు. ఎంవీఏ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి కేంద్ర దర్యాప్తు సంస్థలను వినియోగించడంతో పాటు పలు విధాలుగా కుట్రలు చేశారని పేర్కొన్నారు. కాగా, మనీలాండరింగ్ కేసులో శుక్రవారం ఈడీ విచారణకు హాజరవుతానని పేర్కొన్నారు.