ముంబై: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం మరో 15-20 రోజుల్లో కూలిపోతుందని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) అన్నారు. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు బీజేపీతో కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి ఇప్పటికే డెత్ వారంట్ జారీ అయ్యిందని విమర్శించారు. రాజ్యసభ సభ్యుడైన సంజయ్ రౌత్ మీడియాతో ఆదివారం మాట్లాడారు. ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన షిండే వర్గానికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్తో సహా పలు పిటిషన్లపై తీర్పులు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయన్నారు. ఈ తీర్పు కోసం తాము ఎదురుచూస్తున్నామని, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని చెప్పారు. ‘ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి (ఏక్నాథ్ షిండే) ఆయన 40 మంది ఎమ్మెల్యేల ప్రభుత్వం 15-20 రోజుల్లో కూలిపోతుంది. ఈ ప్రభుత్వానికి డెత్ వారెంట్ జారీ అయ్యింది. దానిపై ఎవరు సంతకం చేస్తారనేది నిర్ణయించాల్సి ఉంది’ అని సంజయ్ రౌత్ అన్నారు. షిండే నేతృత్వంలోని ప్రభుత్వం ఫిబ్రవరిలో కూలిపోతుందని గతంలో కూడా ఆయన వ్యాఖ్యానించారు.
కాగా, గత ఏడాది జూన్లో ఏక్నాథ్ షిండే నేతృత్వంలో 39 మంది శివసేన ఎమ్మెల్యేలు ఆ పార్టీపై తిరుగుబాటు చేశారు. దీంతో సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ భాగస్వామ్యంగా ఉన్న మహా వికాస్ అఘాది (ఎంవీఏ) ప్రభుత్వం పడిపోయింది. అనంతరం ఏక్నాథ్ షిండే బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. గత ఏడాది జూన్ 30న షిండే సీఎంగా, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
మరోవైపు ఏక్నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఉద్ధవ్ ఠాక్రే వర్గం దాఖలు చేసిన పిటిషన్లు, కౌంటర్గా షిండే వర్గం దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వీటిపై తీర్పును గత నెలలో రిజర్వ్ చేసింది. మరో 15-20 రోజుల్లో ఈ తీర్పులను సుప్రీంకోర్టు వెల్లడించనున్నది. ఈ నేపథ్యంలో ఏక్నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని, అప్పుడు ఆ ప్రభుత్వం కూలిపోతుందని శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం భావిస్తున్నది. ఒకవేళ ఇలా జరిగితే ఎన్సీపీ నేత అజిత్ పవార్ వర్గంతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ యోచిస్తున్నది.