ముంబై: మహారాష్ట్రలోని చారిత్రక శివసేన పార్టీ చీలుతుందా? తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండేకు శివసేనను చీల్చే సత్తా ఉందా? మహారాష్ట్ర అసెంబ్లీ రద్దవుతుందా? అన్న ప్రశ్నలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. మొత్తం 57 మంది శివసేన ఎమ్మెల్యేలలో తనకు 46 మంది మద్దతు ఉందని తిరుగుబాటు చేసిన శివసేన మంత్రి ఏక్నాథ్ షిండే తొలుత ప్రకటించారు. తన బృందంతో కలిసి అస్సాం రాజధాని గౌహతికి చేరిన ఆయన 33 ఎమ్మెల్యేలతో కలిసి ఫొటో దిగారు. మరో నలుగురు ఎమ్మెల్యేలు విమానం ఎక్కారని, తన బృందంతో చేరుతారని అన్నారు.
కాగా, ఏక్నాథ్ షిండేతో కలిపి 34 ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖలను గవర్నర్కు బుధవారం పంపారు. ఈ మేరకు మధ్యాహ్నం ఆయన మీడియాకు వెల్లడించారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే సాయంత్రం నిర్వహించే పార్టీ అత్యవసర సమావేశం అక్రమమని ఆరోపించారు.
మరోవైపు శివసేన పార్టీ తమదిగా ప్రకటించుకోవాలంటే ఏక్నాథ్ షిండేకు 37 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. ఈ సంఖ్యతో ఆయన అధికారికంగా శివసేనను చీల్చే అవకాశముంది. ఒకవేళ ఇదే జరిగితే శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, పార్టీతోపాటు మహారాష్ట్రలో ప్రస్తుతం ఎన్సీపీ, కాంగ్రెస్తో కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని కూడా కోల్పోవాల్సి ఉంటుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లవచ్చని తెలుస్తున్నది.