Parliament Security Breach | పార్లమెంట్లో బుధవారం భారీ భద్రతా లోపం వెలుగు చూసిన విషయం తెలిసిందే. లోక్సభలో కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో విజిటర్స్ గ్యాలరీ నుంచి ఓ యువకుడు సభలోకి దూకి షూ నుంచి పసుసు రంగు స్మోక్ తీసి వదిలిన విషయం తెలిసిందే. సదరు యువకుడిని ఎంపీలు పట్టుకొని భద్రతా సిబ్బందికి అప్పగించారు. అయితే, ఈ వ్యవహారంలో అధికారులకు కీలక చర్యలు చేపట్టారు. పార్లమెంట్ హౌస్ సెక్యూరిటీకి చెందిన ఎనిమిది మంది అధికారులను సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన భద్రతా సిబ్బందిలో రాంపాల్, అరవింద్, వీరదాస్, గణేశ్, అనిల్, ప్రదీప్, విమిత్, నరేంద్ర ఉన్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు ఉపా యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వ్యవహారంలో ఆరుగురు వ్యక్తుల పాత్ర ఉన్నట్లు గుర్తించారు.
ఇందులో ఇప్పటికే ఐదుగురిని అరెస్టు చేయగా.. ఓ వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అరెస్టయిన వారిలోడీ మనోరంజన్, సాగర్, అమోల్ షిండే, నీలందేవి, విశాల్ను బుధవారం అదుపులోకి తీసుకోగా.. మరో నిందితుడు విశాల్ను గురుగ్రామ్లో అరెస్ట్ చేశారు. మరో నిందితుడు లలిత్ కోసం గాలిస్తున్నారు. నిన్నటి ఘటన నేపథ్యంలో పార్లమెంట్ పరిసరాల్లో భారీగా పోలీసులు, భద్రతా బలగాలను మోహరించారు. అటువైపుగా వెళ్లే ప్రతి వాహనాన్ని, వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అలాగే లోక్సభ సెక్రటేరియట్ కొత్త భవనం వైపుగా వెళ్లే సభ్యులు స్మార్ట్కార్డ్లను సిద్ధంగా ఉంచుకోవాలని ఎంపీలను కోరింది. లోక్సభ, రాజ్యసభ లాబీ, పార్లమెంట్ కాంప్లెక్స్లోని మరికొన్నిచోట్ల ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ కల్పించినట్లు లోక్సభ సెక్రటేరియట్ వర్గాలు పేర్కొన్నాయి. లోక్సభ ఇప్పటికే విజిటర్లకు ఇచ్చే పాస్లపై నిషేధం విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నిషేధం కొనసాగనున్నది.