నవీ ముంబై, ఏప్రిల్ 15: మహారాష్ట్ర భూషణ్-2022 అవార్డు ప్రదానోత్సవంలో అపశృతి చోటుచేసుకొన్నది. నవీ ముంబైలో కేంద్ర హోంమంత్రి అమిత్షా పాల్గొన్న సభలో ఎండ వేడిమి భరించలేక ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్రమైన ఎండ కారణంగా వడదెబ్బతో వీరంతా మరణించారు. 50 మందికి పైగా వడదెబ్బకు గురయ్యారు. సామాజిక కార్యకర్త దత్తాత్రేయ నారాయణ్కు మహారాష్ట్ర భూషణ్-2022 అవార్డును ప్రదానం చేశారు. అయితే, మిట్ట మధ్యాహ్నం మండుటెండలో ఈ కార్యక్రమం నిర్వహించడంతో అవార్డుల ప్రదానోత్సవానికి విచ్చేసిన సామాజిక కార్యకర్తలు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
మహారాష్ట్ర సర్కారు ప్రజలకు ఎలాంటి సదుపాయాలు కల్పించలేదు. నవీ ముంబైలో ఆదివారం 38 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలకు సిట్టింగ్ ఏర్పాట్లు చేసినప్పటికీ.. పైకప్పులేకపోవడంతో సభకు వచ్చిన ప్రజలు ఎండదెబ్బకు గురయ్యారు. ఎండవేడిమి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తున్నది. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. మహారాష్ట్ర సర్కారు ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు వచ్చే జనం కోసం కనీస వసతులు కల్పించకపోవడం ఏంటని అందరూ మండిపడుతున్నారు. బీజేపీ సర్కారు నిర్లక్ష్యం వల్లే ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.