చెన్నై: కొంతమంది తమ ప్రభుత్వంపై చేసే అర్థం పర్థం లేని విమర్శలపై తాను స్పందించాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని, వాటికి తన పార్టీ నేతలే తగిన సమాధానం చెప్తారని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. మంగళవారం నాగర్కోయిల్లో మాజీ సీఎం, డీఎంకే పార్టీ మాజీ చీఫ్ కరుణానిధి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓర్వలేని కొందరు డీఎంకే ప్రభుత్వానికి ఇబ్బందులు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల తమిళనాడులో వలస కార్మికులపై దాడులు జరుగుతున్నట్టు కొందరు నకిలీ వీడియోలను వైరల్ చేయడాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావిస్తూ ‘కొందరు మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుయుక్తులు పన్నుతున్నారు. రాష్ట్రంలోని ప్రజల మధ్య కుల, మత విద్వేషాలు సృష్టించి వారిని విభజించడానికి ప్రణాళికలు వేస్తున్నారు’ అని తెలిపారు. కేంద్రంలో మూడోసారి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అధికారంలోకి రాకుండా విపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉన్నదని స్టాలిన్ పునరుద్ఘాటించారు.