Food Crisis | హైదరాబాద్, సెప్టెంబర్ 29 (స్పెషల్ టాస్క్ బ్యూరో -నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ విధాన లోపాలు, ముందుచూపు లేమితో ఆహారోత్పత్తుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా భారత్ ఆహార సంక్షోభం దిశగా పయనిస్తున్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నైరుతిలో వర్షపాతం ఏ మేరకు నమోదైంది? పంటల దిగుబడి ఎంత? సరిపడా ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయా లేదా? అనేదానిపై మోదీ సర్కార్కు అంచనాలు లేకపోవడంతో పాటు సంక్షోభ కట్టడికి ప్రత్యామ్నాయ చర్యలు మొదలుపెట్టకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్తున్నారు. దేశంలోని 718 జిల్లాల్లో.. 410 జిల్లాల్లో(57%) ప్రస్తుతం కరువు పరిస్థితులే ఉన్నట్టు స్టాండర్డ్ పర్సెప్షన్ ఇండెక్స్, భారత వాతావరణ శాఖ పేర్కొన్నాయి. నైరుతి సీజన్ ముగుస్తున్నప్పటికీ ఈ ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదైనట్టు తెలిపాయి. దీంతో ధాన్యం దిగుబడి భారీగా పడిపోయే ప్రమాదమున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఫిబ్రవరిలో ఉష్ణోగ్రతలు పెరుగడం, తర్వాత అకాల వర్షాలతో యాసంగి పంట చేతికి రాని విషయాన్ని గుర్తుచేస్తున్నారు. గోధుమలు, బియ్యం సేకరణ లక్ష్యాలను కేంద్రం పూర్తిచేయలేదని, దీంతో రేట్లు భారీగా పెరిగాయని, ఇలాగే కొనసాగితే ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదమున్నట్టు హెచ్చరిస్తున్నారు.
ప్రపంచ దేశాలకు ఆహారోత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి దేశాన్ని తీసుకుపోతామని గప్పాలు కొట్టిన బీజేపీ సర్కారు పాలనలో ప్రస్తుతం తిండి గింజలు దొరకని దుస్థితి దాపురించింది. ఆహార భద్రత కల్పించాలంటూ ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ముందు చేతులు సాచే దుస్థితికి భారత్ రావడమే ఇందుకు నిదర్శనం. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాయంగా ఉండేందుకు ఆహార భద్రత ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఈ మేరకు అభివృద్ధి చెందిన దేశాలపై ఒత్తిడి తేవాలని డబ్ల్యూటీవోకు 80 దేశాలు ఓ విజ్ఞాపన పత్రాన్ని అందజేశాయి.
దీనిపై భారత్ కూడా సంతకాలు చేసింది. అయితే, బియ్యం, గోధుమలను ఎక్కువగా పండించే దేశాల్లో ఒకటైన భారత్.. ఆయా ఆహారోత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలు విధించడాన్ని డబ్ల్యూటీవో ప్రతినిధులు తప్పుబడుతున్నారు. ఈ ఆంక్షలను ఎప్పుడు ఎత్తేస్తారని, సాగు విధానాలు, నిబంధనలు, దేశంలో బియ్యం, గోధుమల నిల్వలు ఏమేరకు ఉన్నాయో వంటి వివరాలు ఇవ్వాలని డబ్ల్యూటీవో సభ్య దేశాలు భారత్పై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ప్రపంచానికి ధాన్యాన్ని సరఫరా చేసేందుకు తాము సిద్ధమేనన్న భారత్.. ఇప్పుడు ఆహారోత్పత్తులపై ఆంక్షలు విధించడమేంటని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.