ఆయన ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం
ఆత్మగౌరవమని.. ఆత్మవంచన చేసుకున్నడు
రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు
రాజేందర్కు భయపడాల్సిన పనిలేదు: ఎంపీ కెప్టెన్
ప్రజాఉద్యమ నాయకుడు పోలవేణి పోచమల్లు టీఆర్ఎస్లో చేరిక
కండువా కప్పి ఆహ్వానించిన అమాత్యుడు
పాల్గొన్న ఎంపీ కెప్టెన్, మంత్రి గుంగుల
కరీంనగర్,(నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ గడ్డ.. టీఆర్ఎస్కు అడ్డా అని, ఎన్నిక ఏదైనా పార్టీదే విజయమని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఆయన ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. ఈటల ఎత్తుకున్నది కాషాయ జెండా అని, మాట్లాడుతున్నది మాత్రం ఎర్ర జెండా మాటలని, ఆయన ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకమని దుయ్యబట్టారు. ఆత్మగౌరవంటూ మాట్లాడి.. చివరికి బీజేపీలో చేరి ఆత్మవంచన చేసుకున్నారని ఎద్దేవా చేశారు. ఆదివారం మాజీ మావోయిస్టు, ప్రజా ఉద్యమనాయకుడు పోలవేణి పోచమల్లు యాదవ్ తన అనుచరులు వెయ్యిమందితో హుజూరాబాద్లో మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వీ లక్ష్మీకాంతారావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఆయనకు మంత్రి హరీశ్రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఈటలపై మంత్రి హరీశ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ మావోయిస్టును అని చెప్పుకునే ఈటల.. అనేక మంది మాజీ మావోయిస్టులపై కేసులు పెట్టించి వేధించేవాడని మండిపడ్డారు. ఇందుకు పొలవేణి పోచమల్లు యాదవే ఒక నిదర్శనమని, ఆయనపై 108 అక్రమ కేసులు పెట్టించాడని మండిపడ్డారు. పోచమల్లుకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించి ఈటలకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపు నిచ్చారు.
రాష్ట్ర సర్కారు ఉద్యమకారులకు కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నదని, అనేక అవకాశాలు ఇస్తున్నదని చెప్పారు. మొదటి సారి టీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన ఎరోళ్ల శ్రీనివాస్ ఎస్సీ కమిషన్ చైర్మన్ అయ్యాడని, రెండో సారి అధ్యక్షుడైన బాల్కసుమన్ ఐదేళ్లు ఎంపీగా చేసి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచాడని, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న గెల్లు శ్రీనివాస్ కూడా ఎమ్మెల్యేగా గెలుస్తాడని స్పష్టం చేశారు. హుజూరాబాద్ ప్రజలు రాజకీయంగా చాలా శక్తిమంతులని, వారికి చాలా విచక్షణ ఉంటుందని పేర్కొన్నారు.
అసలైన బీసీకే ఓటెయ్యాలి: మంత్రి గంగుల
హుజూరాబాద్లో మొదటిసారి బీసీ బిడ్డ గెల్లు శ్రీనివాస్ కు టీఆర్ఎస్ టికెట్ ఇచ్చిందని, ఓటేసి గెలిపించాలని మంత్రి గంగుల కమలాకర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈటల రాజేందర్ పావలా మందమే బీసీ అని, ఆయన ఏనాడూ తాను బీసీ బిడ్డనని చెప్పుకోలేదని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో అసలు బీసీ బిడ్డ అయిన గెల్లుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్సీ పాడికౌశిక్ రెడ్డి, ఎస్పీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ తదితరులున్నారు.