(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్(నమస్తే తెలంగాణ): కొండ ను తవ్వి ఎలుకను పట్టడమంటే బహుశా ఇదేనేమో! లక్షల రూపాయల ప్రజాధనం రైల్వే లో ఎలుకల పాలవుతున్నది. లక్నో రైల్వే డివిజన్లో ఒక్క ఎలుకను పట్టుకోవడానికి అధికారులు రూ.41 వేలు ఖర్చు పెట్టారు. రెండేండ్లలో రూ.69 లక్షలకు పైగా ఖర్చుచేసి.. 168 ఎలుకలను పట్టుకున్నారు. వినటానకి విడ్డూరంగా ఉన్నా.. ఇది నిజమే. ఆర్టీఐ దరఖాస్తుతో వెలుగులోకొచ్చిన వాస్తవాలివి. ఆర్టీఐ కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ దరఖాస్తుకు ఉత్తర రైల్వే జోన్ వెల్లడించిన వివరాలివి. ఒక్క రైల్వే డివిజన్లో ఎలుకల్ని పట్టుకునే పేరిట ఇంత పెద్ద అవినీతి జరుగుతుంటే, మోదీ సర్కార్ ఏం చేస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రెండేండ్లలో మొత్తం 168 ఎలుకల్ని పట్టుకోవడానికి రూ.69.5 లక్షల్ని లక్నో రైల్వే డివిజన్ ఖర్చు చేయటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైల్వే కోచ్ల్లో బొద్దింకలు, నల్లులు, ఎలుకలు, దోమలు నియంత్రణ కోసం ఏటా రూ.23.2 లక్షలు ఖర్చు చేసినట్టు అధికారులు తెలపటం విడ్డూరంగా మారింది. కాంగ్రెస్ ఎంపీ రణ్దీప్ సూర్జేవాలా స్పందిస్తూ..‘ రైళ్లలో వృద్ధులకిచ్చే రాయితీలకు చరమగీతం పాడిన మోదీ సర్కార్కు ఈ అవినీతి కనపడటం లేదా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.