న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కేసులో సీఎం కేజ్రీవాల్(CM Kejriwal)ను అరెస్టు చేస్తారని ఆ రాష్ట్ర మంత్రి ఆతిషి ఆరోపించారు. నవంబర్ 2వ తేదీన ఈడీ విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్కు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ విచారణకు హాజరైన సమయంలో కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మంత్రి అతిషి ఆరోపించారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. కేజ్రీను అరెస్టు చేసే సమాచారం తమకు ఉన్నట్లు ఆమె చెప్పారు. కేజ్రీని జైలుకు పంపేందుకు బీజేపీ సర్కారు ప్లాన్ చేస్తోందన్నారు. ఆమ్ ఆద్మీని అంతం చేయాలని బీజేపీ చూస్తోందని, కేసులు ఉన్నాయని కేజ్రీని అరెస్టు చేయడం లేదని, ప్రధాని మోదీకి కేజ్రీ అంటే భయం అని మంత్రి ఆతిషి ఆరోపించారు. బీజేపీ కానీ, మోదీ కానీ తమను ఎన్నికల్లో ఓడించలేవన్న విషయం తెలుసు అని, ఆప్ను అంతం చేసేందుకే అరెస్టు చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
ఇదే కేసులో రిమాండ్లో ఉన్న ఆప్ నేత మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించిన కొద్ది గంటల్లోనే ఈడీ సీఎం కేజ్రీవాల్కు సమన్లు జారీ చేయడం గమనార్హం.ఈ కేసులో రూ.338 కోట్ల లావాదేవీలకు సంబంధించి తదుపరి నిర్ధారణ జరగాల్సి ఉందన్న కారణంతో సిసోడియాకు బెయిల్ నిరాకరించినట్టు సుప్రీంకోర్టు తెలిపింది.