న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మనీ లాండరింగ్ కేసుల్లో 500 చార్జిషీట్లను దాఖలు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. కేసు నమోదైన తర్వాత సంక్లిష్టమైన వ్యవహారాలను మినహాయించి మిగిలిన కేసు దర్యాప్తు ఒకటి రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలని దర్యాప్తు అధికారులను ఆదేశించినట్లు ఆదివారం ఈడీ వెల్లడించింది.
అస్సాం రాజధాని గువాహటిలో నిరుడు డిసెంబర్ 19-21 తేదీల్లో ఈడీ డైరెక్టర్ రాహుల్ నవీన్ అధ్యక్షతన జరిగిన జోనల్ అధికారుల 34 త్రైమాసిక సమావేశంలో ఈ చర్యలను చర్చించి, ఖరారు చేసినట్లు ఈడీ ఇటీవల తెలిపింది. లక్ష్యాలను అర్థవంతమైన రీతిలో సాధించడం, దర్యాప్తులను తార్కికంగా ముగించడం, ప్రాసిక్యూషన్ ఫిర్యాదులను సకాలంలో దాఖలు చేయడం, జప్తులు, జరిమానాలు చట్టబద్ధంగా, స్థిరంగా, సమర్థవంతంగా అమలు జరిగేలా చూసుకోవడంపై దృష్టి పెట్టాలని అధికారులకు సమావేశంలో సూచించినట్లు ఓ ప్రకటనలో ఈడీ పేర్కొంది.