కోల్కతా: స్కూల్ ఉద్యోగాల కేసుకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీచేసింది. అక్టోబర్ 3న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అయితే దీనిపై అభిషేక్ మండిపడ్డారు. ఉపాధి హామీ బకాయిలు కేంద్ర ప్రభుత్వం చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ తమ పార్టీ ఢిల్లీలో ఆందోళన చేపట్టనున్న నేపథ్యంలో దాన్ని అడ్డుకునేందుకు అదే రోజు విచారణకు రావాలని ఈడీ సమన్లు జారీచేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్ష నాయకుల పట్ల బీజేపీలో నెలకొన్న భయాన్ని ఇది బయటపెట్టిందని అన్నారు. ఈడీ పంపిన సమన్ల కాపీని ఎక్స్ (ట్విట్టర్)లో పంచుకున్నారు. ‘ఢిల్లీలో విపక్ష ఇండియా సమావేశానికి వెళ్లాల్సిన రోజు గతంలో ఈడీ ముందు హాజరయ్యాను. మళ్లీ అదే పునరావృతమైంది’ అని బెనర్జీ తెలిపారు.