ముంబై : మనీల్యాండరింగ్ కేసులో శివసేన ఎంపీ భావన గవాలిని మే 5న తమ దర్యాప్తు అధికారుల ఎదుట హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. గతంలో భావనా గవాలిని మూడు సార్లు హాజరు కావాలని ఈడీ కోరినా ఆమె గైర్హాజరయ్యారు. ఈడీ చివరిసారిగా గత ఏడాది నవంబర్ 24న సేన ఎంపీకి సమన్లు జారీ చేసింది.
2021 సెప్టెంబర్లో గవాలి సన్నిహితులు సయీద్ ఖాన్ను ఈడీ అరెస్ట్ చేసింది. గవాలీ పర్యవేక్షిస్తున్న ఎన్జీవో ద్వారా కోట్ల రూపాయలు దారిమళ్లించారని గత ఏడాది నవంబరలో గవాలీపై చార్జిషీట్ దాఖలైంది. ఖాన్తో పాటు మహిళా ఉత్కర్ష ప్రతిష్టాన్ ఎన్జీవోపైనా చార్జిషీట్ దాఖలైంది. ఎంపీ తల్లి శలింతై గవాలీ, ఖాన్లు కంపెనీ డైరెక్టర్లుగా ఉన్నారు. ట్రస్ట్ను కంపెనీగా మార్చే క్రమంలో ఫోర్జరీ జరిగిందని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.
నిధులను దారిమళ్లించడం, అక్రమాలకు పాల్పడేందుకు ఈ కంపెనీని వాడుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది. ట్రస్ట్లో రూ 17 కోట్ల మేర గవాలీ అవకతవకలకు పాల్పడ్డారని దర్యాప్తు ఏజెన్సీ అనుమానిస్తోంది. బాలాజీ సహకారి పార్టికల్ బోర్డు అనే సంస్ధ పేరుతో జాతీయ సహకార అభివృద్ధి సంస్ద (ఎన్సీడీసీ)ను మోసగించి గవాలీ రూ 43.35 కోట్ల రుణం తీసుకుందని హరీష్ సర్ధా అనే సామాజిక కార్యకర్త ఆరోపణలు గుప్పించారు.