న్యూఢిల్లీ : చైనా మొబైల్ కంపెనీలతో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు కలిగిన దేశవ్యాప్తంగా 30 ప్రదేశాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేపట్టింది. వివోతో పాటు దానికి సంబంధించిన పలు కంపెనీల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో ఈడీ ఫెమా చట్టం కింద షియామికి చెందిన ఆస్తులను సీజ్ చేయగా కర్నాటక హైకోర్టు ఆ ఉత్తర్వులపై స్టే విధించింది.
ఫెమా నిబంధనల కింద స్మార్ట్ఫోన్ దిగ్గజం షియామి ఇండియాకు చెందిన రూ 5521 కోట్లను ఈడీ సీజ్ చేసింది. షియామి ఇండియా చైనాకు చెందిన షియామి గ్రూపునకు చెందిన అనుబంధ కంపెనీ. ఈ ఏడాది పిబ్రవరిలో షియామి చేపట్టిన అక్రమ చెల్లింపులపై ఈడీ దర్యాప్తు జరిపింది. గత కొద్ది కాలంగా చైనా మొబైల్ ఫోన్ కంపెనీల లావాదేవీలపై ఐటీ, ఈడీ కన్నేశాయి. 2014లో భారత్లో షియామి తన కార్యకలాపాలను ప్రారంభించింది. మనీల్యాండరింగ్ ఆరోపణలపై చైనా మొబైల్ ఫోన్ కంపెనీలు లక్ష్యంగా ఈడీ దాడులు జరుగుతున్నాయి.