బెంగాల్లో ఎన్నికలు జరిగే సమయంలోనూ సీఎం మమత బంధువుల ఇండ్లపై సోదాలు జరిగాయి. ఇప్పుడు అదే తరహాలో పంజాబ్లోనూ ఎన్నికల సమయంలోనే కేంద్రం ఈడీ సోదాలు చేయించింది. – పంజాబ్ సీఎం
చండీగఢ్, జనవరి 18: త్వరలో ఎన్నికలు జరుగనున్న పంజాబ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం సోదాలు నిర్వహించడం కలకలం సృష్టిస్తున్నది. సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ మరదలి కుమారుడు భూపిందర్ సింగ్ అలియాస్ హనీ ఇంటితో పాటు డజనుకు పైగా ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. ఇసుక అక్రమ తవ్వకాలు, మనీలాండరింగ్కు సంబంధించిన కేసుల్లో ఈ సోదాలు జరిపినట్టు ఈడీ అధికారులు తెలిపారు. ఈ కేసులో కుద్రాత్దీప్ సింగ్ అనే వ్యక్తి కీలక సూత్రదారుల్లో ఒకరని, ఆయనకు హనీకి సంబంధాలు ఉన్నట్టు తేలడంతో హనీ ఇంటిపై సోదాలు జరిపినట్టు పేర్కొన్నారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కింద చండీగఢ్, మొహాలీ, లూధియానా, పఠాన్కోట్ తదితర ప్రాంతాల్లో ఈ సోదాలు జరిపినట్టు చెప్పారు. అదనపు భద్రత కోసం సీఆర్పీఎఫ్ దళాలను వినియోగించుకున్నట్టు వెల్లడించారు. పంజాబ్లోని కొన్ని రియల్టర్ కంపెనీలు, వ్యక్తులు ఇసుక అక్రమ తవ్వకాలు చేపడుతూ అక్రమ సంపాదనకు పాల్పడుతున్నట్టు 2018లో ఓ ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు తాజాగా సోదాలు జరిపారు. 117 స్థానాలు ఉన్న పంజాబ్లో ఫిబ్రవరి 20న ఎన్నికలు జరుగనున్నాయి.
నన్ను లక్ష్యంగా చేసుకొనే: చన్నీ
ఎన్నికల సమయంలో తనపై, తన మంత్రులపై రాజకీయపరమైన ఒత్తిళ్లు తీసుకురావడానికే కేంద్రంలోని బీజేపీ సర్కారు ఈడీ సోదాలు చేయించిందని సీఎం చన్నీ ఆరోపించారు. తననే లక్ష్యంగా చేసుకొని ఈ తనిఖీలు జరిపినట్టు పేర్కొన్నారు. ‘బెంగాల్లో ఎన్నికలు జరిగే సమయంలోనూ సీఎం మమతా బెనర్జీ బంధువుల ఇండ్లపై సోదాలు జరిగాయి. ఇప్పుడు అదే తరహాలో పంజాబ్లోనూ ఎన్నికల సమయంలోనే కేంద్రం ఈడీ సోదాలు చేయించింది. ఈడీ ద్వారా తమపై ఒత్తిడి తీసుకొస్తూ, ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాతావరణం మంచిది కాదు. ఎన్నికలప్పుడే బీజేపీకి ఈడీ సోదాలు గుర్తొస్తాయి. అయితే, ఎలాంటి ఒత్తిళ్లను ఎదుర్కొనడానికైనా మేమంతా సిద్ధం’ అని చన్నీ మీడియాతో అన్నారు. 2018లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ సోదాలు జరిపిందని మీడియా గుర్తుచేయగా.. ఆ సమయంలో తాను సీఎంగా లేనన్నారు. ఎన్నికల సమయంలో సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలను టూల్గా చేసుకొని సోదాలు చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని కాంగ్రెస్ ఆరోపించింది.
మేము ఎప్పుడో చెప్పాం: ఆప్
ఇసుక అక్రమ తవ్వకాల్లో చన్నీ క్యాబినెట్ మంత్రు లు ఉన్నారని ఇప్పటికే చాలాసార్లు చెప్పామని ఆమ్ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చెప్పా రు. చన్నీనే వారిని పెంచి పోషించారని ఆరోపించారు. అక్రమాలకు పాల్పడ్డ మంత్రులను చన్నీ క్యాబినెట్ నుంచి ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు.