Karti Chidambaram | కాంగ్రెస్ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం శనివారం ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. అంతకు ముందు ఆయన ఈడీ కార్యాలయం వెలుపల విలేకరులతో మాట్లాడారు. ‘ఈడీ విచారణకు నన్ను పిలవడం కొత్త విషయమేమీ కాదు. ఇది దినచర్యగా మారింది. అవే పాత ప్రశ్నలు.. అవే సమాధానాలు. ప్రస్తుతం క్రిస్మస్ సమయం.. శుభాకాంక్షలు చెప్పేందుకు మాత్రమే పిలిచి ఉండాలి’ అన్నారు. 2011లో 263 మంది చైనా పౌరులకు వీసాల జారీ ప్రక్రియలో అవకతవకలపై మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణ జరుపుతున్నది.
ఇందులో భాగంగా కార్తీ చిదంబరాన్ని ప్రశ్నించేందుకు ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఇంతకు సైతం పలుమార్లు ఆయనను ఈడీ విచారించింది. విచారణకు హాజరైన ఆయన మాట్లాడుతూ ఈడీ విచారణకు రావడం 20వ రోజని.. ఇదో సాధారణ వ్యవహారంగా మారుతోందన్నారు. వారు (ఈడీ) అవే విషయాలు అడుగుతారు.. తాను అవే సమాధానాలు ఇస్తానన్నారు. సీబీఐ ఈ కేసును మూసివేందని.. కానీ తిరిగి తెరిచి నన్ను అడగాలనుకుంటున్నారన్నారు.
తన న్యాయవాదులు ఇప్పటికే విస్తృతంగా స్పందించారని.. వంద పేజీల లేఖను అందించారన్నారు. ఇది ఫేక్ కేసని.. ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారనేది తనకు తెలియదని.. అది ఏదో చైనీస్ దెయ్యం అయి ఉండాలన్నారు. అయితే, యూపీఏ హయాంలో చిదంబరం కేంద్రహోంమంత్రిగా ఉన్న సమయంలో కార్తీ చిదంబంరం పవర్ కంపెనీ పనుల కోసం భారత్ వచ్చిన 263 మంది చైనా పౌరులకు వీసాలు ఇచ్చేందుకు రూ.50 లక్షలు తీసుకున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మొదటై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఈడీ రంగంలోకి దిగి మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.