Kejriwal | ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి గురువారం సాయంత్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు చేరుకున్నారు. సుమారు 12 మంది అధికారుల టీం ఆయన ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తున్నది. దీంతో కేజ్రీవాల్ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైనట్లు కనిపిస్తున్నది. తాము సెర్చ్ వారంట్ తీసుకుని వచ్చామని ఈడీ అధికారులు చెప్పారని సీఎం ఇంటి వద్ద విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది అంటున్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ఇంటి వద్ద హై టెన్షన్ నెలకొంది. ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించారు. కేజ్రీవాల్ వాడుతున్న సెల్ ఫోన్ ను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇప్పటికే ఈడీ అధికారులు విచారణకు హాజరు కావాలని తొమ్మిది సమన్లు జారీ చేసినా కేజ్రీవాల్ హాజరు కాలేదు. మరోవైపు గురువారం ఢిల్లీ హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. ప్రస్తుతం కేసు దర్యాప్తు పురోగతిలో ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆ పై కొన్ని గంటల్లోపే ఈడీ అధికారులు.. కేజ్రీవాల్ ఇంటికి వెళ్లి తనిఖీలు నిర్వహిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకున్నది. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తదితరులను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.