న్యూఢిల్లీ: రానున్న లోక్సభ ఎన్నికల్లో తన ప్రచారాన్ని అడ్డుకొనేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తనను అరెస్ట్ చేయాలనుకుంటున్నదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమన్లు న్యాయబద్ధమైనవి కావని ఈడీకి తాను లేఖ రాశానన్నారు.
‘న్యాయబద్ధంగా సమన్లు జారీ చేసి ఉంటే వాటిని నేను అంగీకరించి ఉండేవాడిని. నా నిజాయతీ నాకున్న గొప్ప సంపద. నా ఇమేజ్ను దెబ్బ తీయడం ద్వారా నన్ను పడగొట్టాలని వాళ్లు చూస్తున్నారు’ అని ఆయన అన్నారు. తమ పార్టీ నాయకులు బీజేపీలో చేరకపోవడం వల్లే జైలుకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. మరోవైపు విచారణకు హాజరు కాలేనని కేజ్రీవాల్ పంపిన లేఖను ఈడీ పరిశీలిస్తున్నది. ఆయనకు మరోసారి సమన్లు జారీ చేసే అవకాశమున్నదని ఈడీ అధికారులు వెల్లడించారు.