కోల్కతా: పశ్చిమ బెంగాల్లో రేషన్ కుంభకోణం (PDS Scam) రాజకీయ దుమారం రేపుతున్నది. ఉత్తర 24 పరగణాల జిల్లాకు చెందిన అధికార టీఎంసీ (TMC) కన్వీనర్ షాజాహాన్ షేక్ (Shahjahan Sheikh) ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అధికారులపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. దీంతో అప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. ఈనేపథ్యంలో ఆయనపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లుక్అవుట్ నోటీసులు (Lookout Notice) జారీచేసింది. షాజాహాన్ ప్రోద్భలంతోనే ఇదంతా జరిగిందని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మా అధికారులను చంపాలనే ఉద్దేశంతోనే ఇలా 800 నుంచి 1000 మంది మూకదాడికి పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది. వారి మొబైల్ ఫోన్లు, నగదు, ల్యాప్టాప్లను కూడా దుండగులు ఎత్తుకెళ్లారని వెల్లడించింది.
కాగా, తాను ఇప్పటివరకు ఏ నేరం చేయలేదని షాజాహాన్ స్పష్టం చేశారు. బీజేపీ డ్రామాలో భాగంగానే ఇదంతా జరుగుతున్నదని ఆరోపించారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే చావడానికైనా సిద్ధమే అంటూ ఓ ఆడియో టేప్ను ఆయన విడుదల చేశారు. ‘మరణం అనివార్యం. తనకు ఏ నేరంతోనూ సంబంధం లేదు. ఏదైనా తప్పు చేసినట్లు నిరూపిస్తే మళ్లీ ముఖం చూపించకుండా ఆత్మహత్య చేసుకుంటాను. తాను నేరాన్ని ఎప్పుడూ సమర్ధించను. మీరు నాపై నమ్మకం కోల్పోరని ఆశిస్తున్నాను’ అంటూ అందులో వ్యాఖ్యానించారు.
అసలేం జరిగిందంటే.. రేషన్ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు శుక్రవారం షాజహాన్ షేక్కు సంబంధించిన మూడు ప్రదేశాల్లో సోదాలు చేశారు. ఓ ప్రదేశంలో సోదాలు చేస్తుండగా దాదాపు వెయ్యి మంది వరకు ఈడీ బృందంపై దాడికి పాల్పడ్డారు. ఈడీ అధికారుల వాహనాలను ధ్వంసం చేశారు. కర్రలు, రాళ్లు, ఇటుకలతో వాహనాల అద్దాలను పగుల గొట్టారు. అడ్డుకోబోయిన అధికారులపై దాడి చేశారు. వారి దగ్గర నుంచి మొబైల్ ఫోన్లు, నగదు, పర్సులు, ల్యాప్టాప్లను లాక్కుపోయారు. ఈ దాడిలో ముగ్గురు ఈడీ అధికారులకు గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.